
న్యూఢిల్లీ: ఇండియా, వెస్టిండీస్ మధ్య జరగనున్న రెండు మ్యాచుల టెస్టు సిరీస్ కోసం యువ పేసర్ నవదీప్ సైనీ జట్టుతో పాటే కొనసాగనున్నాడు. నవ్దీప్ సైనీ టీ20, వన్డే జట్టులకు మాత్రమే ఎంపికయ్యాడు కదా?.. మరి టెస్ట్ జట్టుతో పాటే కొనసాగడమేంటి అనుకుంటున్నారా!!. అసలు విషయంలోకి వెళితే.
టెస్టు సిరీస్లో సైనీ కూడా పాల్గొనబోతున్నాడు. కానీ.. బౌలర్గా మాత్రం కాదు. నెట్స్లో భారత బ్యాట్స్మెన్కు బౌలింగ్ చేయడానికి జట్టు యాజమాన్యం అతన్ని ఎంపిక చేసింది. విండీస్తో జరిగిన టీ20 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సైనీ అద్భుత ప్రదర్శన చేసాడు. ముఖ్యంగా మొదటి మ్యాచ్లో విండీస్ బ్యాట్స్మెన్ను వణికించాడు. తన కోట నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి కీలక మూడు వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు.
రెండో మ్యాచ్లో వికెట్ ఏమీ తీయకున్నా.. పొదుపుగా బౌలింగ్ చేసాడు. ఇక మూడో మ్యాచ్లో 34 పరుగులు ఇచ్చినా.. రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ టీ20 సిరీస్లో సైనీ మంచి ప్రదర్శన చేసాడు. ఇతని బౌలింగ్లో బ్యాట్స్మన్ ఇబ్బందిపడుతుండంతో.. భారత ఆటగాళ్లకు ఉపయోగపడుతుందని జట్టుతో పాటు కొనసాగించారు. 'సైనీ బౌలింగ్ బాగుంది. ఎర్ర బంతితో ఆడడానికి అతను అర్హుడు. బౌలింగ్ కోచ్, సీనియర్ బౌలర్ల పర్యవేక్షణలో అతను ఇంకా రాటుదేలే అవకాశం ఉంది' అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి పేర్కొన్నాడు.
'సరైన శిక్షణ ఇస్తే బోల్ట్ రికార్డు బ్రేక్ చేస్తా'
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జరిగిన టీ20, వన్డే సిరీస్లను టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విండీస్ 'ఎ' జట్టుతో టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ పట్టు బిగించింది. విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. సోమవారం ఈ ప్రాక్టీస్ మ్యాచ్ పూర్తవుతుండగా.. ఈనెల 22 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.