
న్యూఢిల్లీ: క్రికెట్ వెస్టిండీస్(సీడబ్ల్యూఐ) వ్యవహారం భారత అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఓ అంతర్జాతీయ సిరీస్ను నిర్వహించడంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చూపిస్తున్న అలసత్వం తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. వర్షం, బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్లు ఆలస్యంగా ప్రారంభమవడం సాధారణంగా చూస్తుంటాం. కానీ క్రికెట్ చరిత్రలోనే కనివినీ రీతిలో లగేజి రాలేదన్న సిల్లీ రీజన్తో మ్యాచ్ను మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభించారు. భారత్- వెస్టిండీస్ మధ్య సోమవారం జరిగిన రెండో టీ20 ఇలానే లేట్ నైట్ జరిగి అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. షెడ్యూల్ ప్రకారం 8 గంటలకు జరగాల్సిన మ్యాచ్ ఇలా సిల్లీ రీజన్స్తో ఆలస్యమైంది.
ఇక సెయింట్స్ కిట్స్ వేదికగా మంగళవారం జరగాల్సిన భారత్-వెస్టిండీస్ మూడో టీ20 కూడా గంటన్నర ఆలస్యంగా ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ను 9:30 గంటలకు రీ షెడ్యూల్ చేశారు. 24 గంటల వ్యవధిలోనే మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లకు తగిన విశ్రాంతినివ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండో టీ20 ఆలస్యంగా ప్రారంభమవడం మూడో టీ20పై ప్రభావం చూపింది. ఈ మేరకు క్రికెట్ వెస్టిండీస్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
'వెస్టిండీస్-భారత మధ్య మూడో టీ20 ఆలస్యంగా ప్రారంభం కానుంది. సోమవారం నాటి మ్యాచ్ ఆలస్యంగా మొదలు కావడంతో మూడో టీ20కు ముందు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి దొరికే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల అంగీకారంతో మూడో టీ20 మ్యాచ్ను గంటన్నర ఆలస్యంగా ప్రారంభించాలని నిర్ణయించాం. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12:00 గంటల(భారత కాలమానం ప్రకారం రాత్రి 9: 30 గంటలు)కు ప్రారంభమవుతుంది'అని విండీస్ క్రికెట్ బోర్డు పేర్కొంది. బీసీసీఐ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇక ఆలస్యంగా ప్రారంభమైన రెండో టీ20లో భారత్పై విండీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. పేలవ బ్యాటింగ్ భారత విజయవకాశాలను దెబ్బతీసింది.