
సెయింట్ కిట్స్ : భారత్, వెస్టిండీస్ మధ్య జరగాల్సిన రెండో టీ20 మరింత ఆలస్యంగా ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. విచిత్ర కారణాలతో ఈ మ్యాచ్కు ఆలస్యం అవుతోంది. షెడ్యూల్ ప్రకారం... రాత్రి 8 గంటలకు ప్రారంభమవ్వాల్సిన ఈ మ్యాచ్ 2 గంటలు ఆలస్యంగా 10 గంటలకు మొదలవుతుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తొలుత ప్రకటించింది.
తొలి మ్యాచ్ జరిగిన ట్రినిడాడ్లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ నుంచి సెయింట్ కిట్స్కు చేరాల్సిన టీమ్ లగేజీ సమయానికి రాకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వివరణ ఇచ్చింది. ఈ అసౌకర్యం పట్ల వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పశ్చాతాపం వ్యక్తం చేయడంతో పాటు అభిమానులు, స్పాన్సర్స్, బ్రాడ్కాస్ట్ పార్ట్నర్స్, స్టేక్హోల్డర్స్కు క్షమాపణలు తెలియజేసింది.
అయితే 10 గంటలకు కూడా మ్యాచ్ ప్రారంభం కాలేదు. టాస్ మరింత ఆలస్యం అవుతుందని నిర్వాహకులు ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవనుందని ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే ట్వీట్ చేశాడు. ఇరు జట్లూ 20 ఓవర్ల చొప్పున ఆడనున్నాయని పేర్కొన్నాడు.
అయితే.. అనివార్య పరిస్థితుల కారణంగా ఆలస్యంగా ప్రారంభమవ్వడం భారత క్రికెట్ ఫ్యాన్స్ని కాస్త నిరాశకు గురిచేస్తోంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలైతే 11 : 30 గంటల కల్లా పూర్తవుతుంది. అదే 11 గంటల మొదలైతే అర్ధరాత్రి దాటాక 2:30 గంటల వరకు మ్యాచ్ కొనసాగనుంది. మ్యాచ్ చూడాలనుకునేవాళ్లు అంతసేపు నిద్రకోర్చుకోవడం కష్టమని వారు కామెంట్ చేస్తున్నాడు.
కాగా మొదటి మ్యాచ్ గెలిచిన రోహిత్ శర్మ సేన మంచి జోరు మీద కనిపిస్తోంది. నేడు (సోమవారం) రెండో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్లో ఇంకో అడుగు ముందుకేయాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్టు 2 రోజులపాటు ప్రాక్టీస్ కూడా చేసింది. ఇక శుక్రవారం ముగిసిన తొలి మ్యాచ్లో టీమిండియా సమష్టి ప్రదర్శనతో విజయం సాధించింది. 68 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి సిరీస్లో అదిరిపోయే బోణి చేసింది. కాగా రెండవ మ్యాచ్ జరగబోయే వేదిక సెయింట్ కిట్స్లోనే మూడవ మ్యాచ్ జరగనుంది. మంగళవారమే ఈ మ్యాచ్ జరగనుంది.