హైదరాబాద్: లాంగ్ బ్రేక్ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. జూలై 12 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్ట్ల సిరీస్తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనుంది. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు రెండు రోజుల వామప్ మ్యాచ్లు ఆడనుంది. బుధవారం నుంచి ప్రాక్టీస్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి.
దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ పర్యటన కోసం బీసీసీఐ జట్లను కూడా ప్రకటించగా.. ఇప్పటికే టెస్ట్ టీమ్ కరేబియన్ గడ్డపై అడుగుపెట్టి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. జూలై 12-16 మధ్య తొలి టెస్ట్, జూలై 20-14 మధ్య రెండో టెస్ట్ జరగనుండగా.. భారత కాలమానం ప్రకారం ఈ రెండు మ్యాచ్లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

తొలి సెషన్ 7.30 నుంచి 9.30 వరకు రెండో సెషన్ 10.10-12.10 మధ్య, మూడో సెషన్ 12.30-2.30 వరకు జరగనుంది. ఈ మ్యాచ్లు చూడాలంటే భారత అభిమానులు జాగారమే చేయాలి. ఈ కారణంతో ఈ మ్యాచ్ల బ్రాడ్కాస్టింగ్ హక్కులకు స్టార్ స్పోర్ట్స్, సోనీ స్పోర్ట్స్ చానెల్స్ దూరంగా ఉన్నాయి. దాంతో ఈ సిరీస్కు అధికారిక బ్రాడ్కాస్టర్ లేకుండా పోయింది.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డీడీ స్పోర్ట్స్ ఈ మ్యాచ్లు ప్రసారం చేయనుండగా.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికగా ప్రసారం చేసేందుకు జియో సినిమా ముందుకు వచ్చింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అఫిషియల్ బ్రాడ్ కాస్టర్ ఫ్యాన్ కోడ్తో ఒప్పందం చేసుకున్న జియో ఫ్రీగా వెస్టిండీస్ పర్యటనలోని మ్యాచ్లను ప్రసారం చేయనుంది.
ఈ క్రమంలోనే ఫ్యాన్స్.. విండీస్ పర్యటన మ్యాచ్లను చూడాంలే జియోసినిమాతో జాగారం చేయాలని కామెంట్ చేస్తున్నారు. మూడు వన్డేల సిరీస్ జూలై 27 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగనుండగా.., తొలి వన్డే జూలై 27న, రెండో వన్డే జూలై 29న, మూడో వన్డే ఆగస్టు 1న జరగనుంది. వన్డే మ్యాచ్లు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. అర్ధరాత్రి మూడు గంటల వరకు ఈ మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది.
ఐదు టీ20ల సిరీస్ ఆగస్టు 4 నుంచి 13వరకు జరగనుంది. తొలి టీ20 ఆగస్టు 4, రెండో టీ20 ఆగస్టు6న, మూడో టీ20 ఆగస్టు 8న, నాలుగో టీ20 ఆగస్టు 12న, ఐదో టీ20 ఆగస్టు 13న జరుగనుండగా.. రాత్రి 8 గంటలకు మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అర్థరాత్రి 12వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇక టెస్ట్, వన్డే టీమ్స్ను ప్రకటించిన బీసీసీఐ.. టీ20 టీమ్ను ప్రకటించలేదు.
హార్దిక్ సారథ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది.