తరౌబా: వెస్టిండీస్ గడ్డపై వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. తరౌబా వేదికగా నేడు(గురువారం) రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్న తొలి టీ20లో ఆతిథ్య వెస్టిండీస్తో అమీతుమీ తేల్చుకోనుంది. పూర్తిగా కుర్రాళ్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 లక్ష్యంగా సిద్దమవుతోంది.
మరోవైపు టెస్ట్, వన్డే సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్ తమకిష్టమైన టీ20 సిరీస్లో చెలరేగాలని భావిస్తోంది. టీ20 సిరీస్ గెలిచి పరువు కాపాడుకోవాలనుకుంటోంది. దాంతో ఈ సిరీస్ అభిమానులకు కావాల్సిన మజాను అందించనుంది.

కుర్రాళ్లకు ఛాన్స్..:వెస్టిండీస్తో అయిదు టీ20ల సిరీస్లో భారత తుది జట్టు ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మతో పాటు మరో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో టీ20 అరంగేట్రం చేసే అవకాశముంది.
శుభ్మన్ గిల్తో కలిసి యశస్వి జైస్వాల్నే ఓపెనింగ్ చేయనున్నట్లు సమాచారం. ఇషాన్ కిషన్ మూడో స్థానంలో ఆడొచ్చు. సంజు శాంసన్ ఆడటంపై సందేహాలున్నాయి. అతను ఆడాలంటే ఇషాన్ తన స్థానాన్ని త్యాగం చేయాలి. తిలక్ నాలుగో స్థానంలో ఆడతాడని అంచనా.
అనుభవజ్ఞులైన కెప్టెన్, హార్దిక్ పాండ్య, వైస్కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్లో జట్టును ముందుండి నడిపించాల్సి ఉంది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నారు. మూడో స్పిన్నర్గా చాహల్, రవి బిష్ణోయ్ల్లో ఒకరిని ఎంచుకునే అవకాశం కూడా ఉంది.
టెస్టుల్లో, వన్డేల్లో అరంగేట్రం చేసి చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న ముకేశ్ కుమార్ టీ20ల్లో కూడా అవకాశం అందుకోనున్నాడు. అతను ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్లలో ఒకరితో కొత్త బంతిని పంచుకోనున్నాడు.
ప్రమాదకరంగా వెస్టిండీస్..:ఈ మధ్యే అమెరికా వేదికగా జరిగిన మేజర్ క్రికెట్ లీగ్ టోర్నీలో నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. ముఖ్యంగా ఫైనల్లో చుక్కలు చూపించాడు. కేవలం 55 బంతుల్లోనే 137 పరుగులతో అజేయంగా నిలిచిన పూరన్.. ఏకంగా 13 సిక్సర్లు బాదేశాడు.
ఈ ఇన్నింగ్స్ చేజింగ్లో కావడం మరో విశేషం. టీ20ల్లో విండీస్ వీరులు ఎంత ప్రమాదకారులో చెప్పడానికి ఇది కేవలం ఉదాహరణ. పూరన్ ఒక్కడే కాదు.. కైల్ మేయర్స్, రోమన్ పావెల్, హెట్మయర్, హోల్డర్, రోస్టన్ చేజ్, ఒడియన్ స్మిత్, రొమారియో షెఫర్డ్.. వీళ్లంతా కూడా ప్రమాదకారులే. వీరిలో హెట్మయర్ మినహా అందరూ ఆల్రౌండర్లే కావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

నిమిషాల్లో మ్యాచ్ ఫలితాలు మారిపోయేలా విధ్వంసం సృష్టించడం కరీబియన్ క్రికెటర్లకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి తొలి టీ20లో టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సిందే.
పరుగుల మోత..:తొలి టీ20కి ఆతిథ్యమివ్వనున్న బ్రయాన్ లారా స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. భారత్, విండీస్ చివరి వన్డే జరిగింది ఇక్కడే. టీమిండియా బ్యాటర్లు జట్టుకు 350 పైచిలుకు స్కోరు సాధించిపెట్టారు. బౌలర్లకు కూడా పిచ్ నుంచి సహకారం ఉంటుంది. పేసర్లతో పాటు స్పిన్నర్లకూ అవకాశముంటుంది. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే సూచనలున్నాయి.
తుది జట్లు (అంచనా)..
భారత్: శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్/రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్/అవేష్ ఖాన్, ముకేశ్కుమార్.
వెస్టిండీస్: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, షై హోప్/చార్లెస్, నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మైర్, రోమన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్, జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్/ఒడియన్ స్మిత్, అకీల్, అల్జారి జోసెఫ్.