ఐసోలేషన్లో 8 మంది
కృనాల్ పాండ్యాకి గత మంగళవారం కరోనా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. అతనితో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లను బీసీసీఐ ఐసోలేషన్కి తరలించింది. సోమవారం రాత్రి కృనాల్ పాండ్యాతో కలిసి ఈ ఎనిమిది మంది భోజనం చేసినట్లు అక్కడి బీసీసీఐ అధికారులు గుర్తించారు. దాంతో మంగళవారమే ఆ 8 మందికి ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించగా.. అందరికీ నెగటివ్ వచ్చింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బుధవారం, గురువారం జరిగిన రెండు టీ20 మ్యాచ్లకీ ఆ 8 మందిని దూరంగా పెట్టారు.
మరో హోటల్కి తరలింపు
ఎనిమిది మందిలో యుజ్వేంద్ర చహల్, కృష్ణప్ప గౌతమ్లు కూడా ఉన్నారు. తాజాగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో చహల్, గౌతమ్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే చహల్ క్వారంటైన్లో ఉండగా.. తాజాగా గౌతమ్ను కూడా ఐసోలేషన్కు పంపించారు. వీరిద్దరూ కొలంబోలోని మౌంట్ లావినియా హోటల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ ఇద్దరికీ స్వల్ప లక్షణాలే ఉన్నట్టు సమాచారం. బీసీసీఐ వైద్య బృందం వారిని పర్యవేక్షిస్తోంది. ఈ ఇద్దరు కరోనా బారీన పడడంతో మరోసారి ఆటగాళ్లకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే టీ20 సిరీస్ ఓటమితో బాధలో ఉన్న భారత జట్టుకు ఇది భారీ షాక్ అనే చెప్పాలి. ఆటగాళ్లకు కరోనా సోకుతుండడంతో బీసీసీఐ ఆందోళన పడుతోంది.
చిక్కుల్లో షా, సూర్య
మరోవైపు ఇంగ్లండ్ టూర్కి ఎంపిక చేసిన జట్టులో లంక పర్యటనలో ఉన్న పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్లు తొలుత లేరు. ఓపెనర్ శుభమన్ గిల్, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, స్టాండ్ బై బౌలర్ అవేష్ ఖాన్లు గాయపడటంతో.. వారి స్థానాల భర్తీ కోసం ఈ ఇద్దరినీ పంపనున్నట్లు బీసీసీఐ గత సోమవారం ప్రకటించింది. ఈ లోగా ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్గా తేలడంతో.. ఈ ఇద్దరు క్రికెటర్లు చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం కొలంబోలో ఐసోలేషన్లో ఉన్న షా, సూర్య మరో రెండు ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లో కరోనా నెగటివ్ వచ్చిన తర్వాతే అక్కడికి బయల్దేరనున్నారు. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకూ భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది.
Tokyo Olympics 2021: క్వార్టర్ఫైనల్లో ఓడిన దీపికా కుమారి.. భారత్ ఆశలు గల్లంతు!!
పాజిటివ్ వచ్చిన ప్లేయర్స్ లంకలోనే
శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను కైవసం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్ను మాత్రం కోల్పోయింది. మొదటి టీ20 మ్యాచ్ నెగ్గిన ధావన్ సేన.. తర్వాత వరుసగా రెండు, మూడు టీ20 మ్యాచ్ల్లో ఓడిపోయి సిరీస్ను 1-2తో కోల్పోయింది. అయితే ఐపీఎల్ 2021కు ఇంకా సమయం ఉండడంతో ఆటగాళ్లంతా ప్రస్తుతం కొద్దిరోజుల పాటు లంకలోనే ఉండనున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల అనంతరం నెగెటివ్ వచ్చిన ఆటగాళ్లను స్వదేశానికి పంపించి.. పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లను లంకలోనే ఉంచనున్నారని సమాచారం.