టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ 2021లో మెడల్ ఆశలు రేపిన భారత ఆర్చర్, వరల్డ్ నంబర్ వన్ దీపికా కుమారి నిరాశపరిచింది. శుక్రవారం జరిగిన మహిళల వ్యక్తిగత రికర్వ్ క్వార్టర్ఫైనల్లో దీపికా ఓటమిపాలైంది. కొరియా ఆర్చర్ ఆన్ సాన్తో జరిగిన క్వార్టర్స్లో 0-6తో దీపికా పరాజయం పాలైంది. మూడు సెట్లలోనూ దీపికపై ఆన్ సాన్ పైచేయి సాధించింది. ఎక్కడ కూడా అవకాశం ఇవ్వని కొరియా ఆర్చర్ అద్భుత ఆటతో సెమీస్ చేరింది.
భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి మూడు సెట్లలో 27, 24, 24 స్కోరు చేయగా.. కొరియా ప్లేయర్ ఆన్ సాన్ 30, 26, 26 స్కోరు చేసి సులువుగా గెలిచింది. దీపికా వరుసగా మూడు సెట్లలో వెనకపడడం విశేషం. ఈ ఓటమితో టోక్యో ఒలింపిక్స్ 2021లో మెడల్ గెలిచే అవకాశాన్ని దీపిక కోల్పోయింది. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి మెడల్పై ఆశలు రేపిన దీపికా.. క్వార్టర్ఫైనల్తోనే ఇంటిదారి పట్టింది.
ఇక శుక్రవారం ఉదయం జరిగిన ప్రిక్వార్టర్స్లో రష్యా ఆర్చర్ కేనియా పెరోవాపై 6-5 తేడాతో దీపికా కుమారి విజయం సాధించింది. ఐదు సెట్లు ముగిసే సరికి ఇద్దరు 5-5 స్కోరుతో సమంగా నిలవడంతో.. షూట్ ఆఫ్లో ఫలితం తేల్చాల్సి వచ్చింది. 28 స్కోరుతో తొలి, మూడో సెట్లను దీపికా కుమారి గెలిచింది. నాలుగో సెట్లో ఇద్దరు స్కోర్లు సమం కాగా.. రెండు, ఐదో సెట్లను కేనియా పెరోవా సొంతం చేసుకుంది.
వరుసగా మూడు మ్యాచ్లలో ఓడిన భారత హాకీ మహిళల జట్టు చివరకు బోణీ కొట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్పై 1-0తో గెలుపొందింది. తొలి మూడు క్వార్టర్లలో ఒక్క గోల్ కూడా నమోదు కాకపోగా.. చివరి క్వార్టర్లో నవ్నీత్ కౌర్ గోల్ చేసి ఇండియాకు విజయాన్ని అందించింది. ఇప్పటి వరకూ 4 మ్యాచ్లలో ఒకటి గెలిచిన భారత్.. మూడు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇప్పటికైతే నాకౌట్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగే చివరి మ్యాచ్లో గెలిస్తేనే నాకౌట్ అవకాశాలు ఉంటాయి.