
న్యూఢిల్లీ: సొంతగడ్డపై శ్రీలంకతో జరగనున్న అప్కమింగ్ టీ20 సిరీస్కు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. తీరిక లేని క్రికెట్ ఆడుతున్న విరాట్కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు క్రిక్ బజ్ ఓ కథానాన్ని ప్రచురించింది. ఫిబ్రవరి 24న ప్రారంభంకానున్న ఈ సిరీస్లో భారత సీనియర్ ప్లేయర్స్ రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా రిఏంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
భారత పర్యటనలో భాగంగా శ్రీలంక మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. గాయంతో సౌతాఫ్రికా పర్యటనకు దూరమైన జడేజా.. నేషనల్ క్రికెట్ అకాడమీలోని పునరావాస కేంద్రంలో గత కొంత కాలంగా శిక్షణ పొందుతున్నాడు. అయితే ఇప్పటికే భారత్- శ్రీలంక తొలి టీ20 వేదిక అయిన లక్నోకు జడేజా చేరుకుని ఐసోలేషన్లో ఉన్నట్లు క్రిక్బజ్ పేర్కొంది. జడేజాతో పాటు వెస్టిండీస్తో సిరీస్లకు విశ్రాంతి తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా కూడా తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఇక వెస్టిండీస్తో రెండో టీ20లో విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చాడు. వన్డే సిరీస్తో పాటు తొలి టీ20లో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే మూడో టీ20లో తనదైన బ్యాటింగ్తో విరాట్ విమర్శకులకు సమాధానం చెప్పాడు. అయితే హాఫ్ సెంచరీ వెంటనే.. చేస్ సూపర్ డెలివరీకి కోహ్లీ ఔటయ్యాడు. అయితే కోహ్లీకి ఇది కెరీర్లో 30వ టీ20 హాఫ్ సెంచరీ. కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడంపై అతని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో భారత్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 52), రిషభ్ పంత్(28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ మూడు వికెట్లు తీయగా.. రొమారియో షెఫర్డ్, షెల్డన్ కాట్రెల్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 178 పరుగులే చేసి ఓటమి పాలైంది. నికోలస్ పూరన్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 62), రోమన్ పోవెల్ (36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 68 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి పూరన్ ఔట్ చేయడంతో భారత్ విజయం లాంఛనమైంది.