
కొలంబో: శ్రీలంక పర్యటనకు భారత్ బలహీనమైన రెండో జట్టును పంపించడం తమ క్రికెట్ను అవమానపర్చడమేనని ఆ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రణతుంగ కామెంట్స్ అర్థరహితమని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. ఇక టీమిండియా యువ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ముందు రణతుంగ కామెంట్స్ ప్రస్తావించగా.. వాటిని తాము పట్టించుకోమని తెలిపాడు.
ఈ టూర్లోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ సానుకూలంశాలను తీసుకెళ్లేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపాడు. వర్చువల్గా మీడియాతో మాట్లాడిన సూర్య.. ఇంట్రా స్వ్కాడ్ ప్రాక్టీస్ సెషన్ బాగా సాగిందని, సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆటగాళ్లంతా సిద్దంగా ఉన్నారని తెలిపాడు.
'రణతుంగ కామెంట్స్ గురించి మేం ఏమాత్రం ఆలోచించడం లేదు. సరదాగా గడుపుతూ.. సిరీస్ను ఆస్వాదించాలనుకుంటున్నాం. ఇక్కడి నుంచి సానుకూలంశాలను తీసుకెళ్లాలనుకుంటున్నాం.'అని సూర్య తెలిపాడు. ఇక రాహుల్ ద్రవిడ్ కోచ్ గురించి తాను ఎన్నో విషయాలు విన్నానని, ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. జూలై 13 నుంచి ఆతిథ్య శ్రీలంకతో శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శనతో టీమిండియా పిలుపును అందుకున్న సూర్య.. స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. తన కెరీర్ ఫస్ట్ ఇన్నింగ్స్లోనే 57 పరుగులతో రాణించాడు.
ఇక విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. మరోవైపు శిఖర్ ధావన్ సారథ్యంలోని మరో జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆటగాళ్లపై మానసిక ఒత్తిడి తగ్గించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ టూర్ సక్సెస్ అయితే భవిష్యత్తులోనూ ఏకకాలంలో భారత జట్లు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనున్నాయి.
టీమిండియా బీ టీమ్ రావడం తమదేశ క్రికెట్కు అవమానమన్న రణతుంగ.. టీమిండియా సెకండ్ టీమ్తో సిరీస్లకు అంగీకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డుకు బుద్ది లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. టెలివిజన్ మార్కెటింగ్ అవసరాల నేపథ్యంలో ఈ సిరీస్కు లంక బోర్డు అంగీకరించినట్లు అర్థమవుతోందని విమర్శించాడు.