ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా బ్యాటర్ల జోరు కొనసాగుతోంది. శ్రీలంకతో జరుగుతున్న చివరి సూపర్-4 మ్యాచ్లో టీమిండియా 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. అభిషేక్ శర్మ(31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 61), తిలక్ వర్మ(34 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 49 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 202 పరుగులు చేసింది.
సంజూ శాంసన్(23 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 39), అక్షర్ పటేల్ (15 బంతుల్లో ఫోర్, సిక్స్తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. శ్రీలంక బౌలర్లలో మహీష తీక్షణ, దుష్మంత్ చమీర, వానిందు హసరంగ, డసన్ షనక, చరిత్ అసలంక చెరో వికెట్ తీసారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్మన్ గిల్(6) మరోసారి నిరాశపర్చాడు. తీక్షణ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్గా వెనుదిరిగాడు. గిల్ ఔటైనా.. అభిషేక్ శర్మ తనదైన శైలిలో చెలరేగాడు. విధ్వంసకర బ్యాటింగ్ లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో నువాన్ తుషార బౌలింగ్లో బౌండరీ బాది 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో టీమిండియా పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది.

పవర్ ప్లే ముగిసిన వెంటనే శ్రీలంక కెప్టెన్ అసలంక.. స్పిన్నర్ను బరిలోకి దించి ఫలితాన్ని రాబట్టాడు. హసరంగా బౌలింగ్లో స్వీప్ షాట్ ఆడబోయి సూర్య(12) ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. దాంతో రెండో వికెట్కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి తిలక్ వర్మ రాగా.. దూకుడుగా ఆడే ప్రయత్నంలో అభిషేక్ శర్మ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
ఇక సంజూ శాంసన్తో కలిసి తిలక్ వర్మ తనదైన శైలిలో చెలరేగాడు. సంజూ కూడా భారీ సిక్స్లు బాదడంతో టీమిండియా స్కోర్ బోర్డు పరుగెత్తింది. హాఫ్ సెంచరీ దిశగా సాగిన సంజూ శాంసన్ను డసన్ షనక ఊరించే బంతితో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(2) భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ సాయంతో తిలక్ వర్మ చెలరేగాడు. ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి అక్షర్ పటేల్ సిక్స్ బాది టీమిండియా స్కోర్ను 200 పరుగుల మార్క్ ధాటించాడు.