
కొలంబో: భారత్తో సిరీస్కు ముందు శ్రీలంక టీమ్లో వరుసగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనను ముగించుకొని వచ్చిన జట్టులో మొదట బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కరోనా బారిన పడగా.. ఇప్పుడు ఆ టీమ్ డేటా అనలిస్ట్ జీటీ నిరోషన్కు కూడా కరోనా బారిన పడ్డాడు. ఇంగ్లండ్ టూర్లో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడిన శ్రీలంక టీమ్.. రెండు సిరీస్ల్లో క్వీన్ స్వీప్ అయింది. అయితే ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ జట్టులో ముగ్గురు ప్లేయర్స్ సహా మొత్తం ఏడుగురు కరోనా బారిన పడ్డారు.
అక్కడి నుంచి స్వదేశానికి వచ్చిన శ్రీలంక జట్టుకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. బ్యాటింగ్ కోచ్తో సహా అనలిస్ట్కు పాజిటివ్ వచ్చిందని శ్రీలంక క్రికెట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. గురువారం ప్లేయర్స్, కోచింగ్, సపోర్ట్ స్టాఫ్కు టెస్టులు నిర్వహించగా నిరోషన్కు పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది. అయితే ఆటగాళ్లకు మాత్రం నెగటీవ్ వచ్చిందని పేర్కొంది. ఫ్లవర్, నిరోషన్లు ప్రస్తుతం క్వారంటైన్లో ఉండి.. చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.
కేవలం 48 గంటల వ్యవధిలోనే బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, డేటా ఎనలిస్ట్ జీటీ నిరోషన్లకు కరోనా పాజిటివ్గా నిర్దారణ కావడంతో టీమిండియాతో జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్ల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరు జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లంక జట్టులో కరోనా కలకలం.. ఆటగాళ్లలో భయాన్ని రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో జులై 13 నుంచి మొదలవాల్సిన భారత్- శ్రీలంక వన్డే సిరీస్ సజావుగా సాగుతుందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గత నెల చివర్లోనే శ్రీలంకకి చేరుకున్న శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత్ జట్టు ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచులు ఆడుతోంది. రెండో ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు సత్తాచాటారు. గురువారం మొదలైన ఈ మ్యాచ్లో మొదటగా టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3 వికెట్లు), యజ్వేంద్ర చహల్ (2 వికెట్లు) చెలరేగగా.. శుక్రవారం భారత బ్యాట్స్మెన్లు బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, నితీష్ రాణాలు ఆకాశమే హద్దుగా ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను శ్రీలంక క్రికెట్ యూట్యూబ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.