న్యూఢిల్లీ: శ్రీలంక పర్యటనకు ఎంపికైన టీమిండియా.. 14 రోజుల క్వారంటైన్ సోమవారం ప్రారంభకానుంది. 14 నుంచి 28వ తేదీ వరకు ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ ముంబైలోని ఓ హోటల్లో క్వారంటైన్లో ఉంటారు. ఈ సమయంలో ఆరుసార్లు ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేస్తారు. ఈ టెస్ట్లన్నీంటిలో నెగటివ్ వచ్చిన వారంతా ప్రత్యేక విమానంలో కొలంబో వెళ్తారు. ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీసేన పాటిస్తున్న నిబంధనలనే ధావన్ సేనకు కూడా వర్తింపజేయనున్నారు.
'ఇంగ్లండ్లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఎలాంటి నిబంధనలు పాటిస్తుందో లంక పర్యటనలోనూ ధావన్ సారథ్యంలో టీమిండియాకు అవే వర్తిస్తాయి. ఈ పర్యటనకు బయల్దేరే ముందు భారత జట్టు ముంబైలో 14 రోజులు క్వారంటైన్లో ఉంటుంది. ఏడు రోజులు కఠిన క్వారంటైన్ తర్వాత.. బయో బుడగలో మిగిలిన ఆటగాళ్లతో కలుసుకునే వీలు ఉంటుంది. జిమ్ సెషన్లకు కూడా హాజరు కావొచ్చు'అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
జులై 13న ఆరంభమయ్యే ఈ పర్యటనలో శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న విషయం తెలిసిందే. ఇక భారత జట్టుకు మ్యాచ్ సిమ్యులేషన్ ప్రాక్టీస్ కూడా ఉండనుంది. వ్యక్తిగత సెషన్ తర్వాత ఇది ఉండే అవకాశం ఉంది. ఇక కొలంబో చేరిన తర్వాత క్రికెటర్లు మూడు రోజులు క్వారంటైన్లో ఉంటారు. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. టీమిండియా గత కొన్నేళ్లుగా కొలంబోలో హోటల్ తాజా సముద్రలోనే బస చేస్తోంది. ఇప్పుడు కూడా అదే హోటల్ కేటాయించినట్లు తెలుస్తోంది.
ఈ పర్యటనకు ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ 20 మందితో కూడిన జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో సత్తా చాటిన దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, కృష్ణప్ప గౌతమ్, చేతన్ సకారియా, నితీష్ రాణా తొలిసారి టీమిండియా పిలుపునందుకున్నారు.