
న్యూఢిల్లీ: టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ గాయం అటు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీసేనను.. ఇటు శ్రీలంక టూర్లోని శిఖర్ ధావన్ సేనను ఇబ్బంది పెడుతోంది. జట్టు యాజమాన్యం, బీసీసీఐ, సెలక్షన్ కమిటీ మధ్య అంతరాలను, అగాథాలను ఎత్తి చూపుతోంది. ఫలితంగా నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్, మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్కు అసహనాన్ని తెపిస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ కోసం యూకే వెళ్లిన శుభ్మన్.. ఎడమ కాలి కండరాల గాయంతో అర్ధంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది.
దాంతో అతని స్థానంలో పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ను ఇంగ్లండ్ పంపించాలని కోహ్లీసేన సెలెక్టర్లను కోరింది. ఈ ప్రతిపాదనను చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తిరస్కరిస్తోందని సమాచారం. ఇప్పటికే అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఉండగా మరో ఇద్దరు ఎందుకన్నది వారి ఉద్దేశంగా తెలుస్తోంది. దాంతో కోహ్లీసేన అసంతృప్తికి లోనైంది. అయితే సెలక్టర్ల తీరుతో శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ శిఖర్ ధావన్ సైతం అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది.
పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ విషయంలో స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణం. వారిద్దరూ జట్టు కూర్పులో అంతర్భాగం. ఐపీఎల్లో ఈ ఇద్దరూ మంచి ఫామ్ కనబరిచారు. లంకలో టీమిండియాకు శుభారంభాలు అందించాలంటే శిఖర్ ధావన్తో పాటు పృథ్వీ షా ఆడటం కీలకం. ఇప్పుడు వారు పూర్తి సిరీస్కు అందుబాటులో ఉంటారా? ఉండరా? మధ్యలో ఇంగ్లండ్ వెళ్తారా? అనే స్పష్టమైన సమాచారం లేదు. దాంతో ద్రవిడ్ స్పష్టత కోరుకుంటున్నారని సమాచారం.
ఇక బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి కోహ్లీసేన నుంచి అధికారికంగా ఎలాంటి రిక్వెస్ట్ రాలేదని, వచ్చిన తర్వాత ఇద్దరు ఓపెనర్లను పంపించవచ్చని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. శ్రీలంకతో సిరీస్లు పూర్తయిన తర్వాతే పడిక్కల్, షా ఇంగ్లండ్కు వెళ్లే అవకాశం ఉందన్నాడు. 'ప్రస్తుతానికైతే పృథ్వీషా, పడిక్కల్ను పంపించాలని టీమ్మేనేజ్మెంట్ నుంచి సౌరవ్ గంగూలీ, జైషాకు ఎలాంటి అధికారిక రిక్వెస్ట్ రాలేదు. ప్రస్తుతం షా, పడిక్కల్ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంకలో ఉన్నారు. జూలై 26 తర్వాత వారిద్దరూ ఇంగ్లండ్కు వెళ్లే అవకాశం ఉంది. కానీ టీమ్మేనేజ్మెంట్ మాత్రం డర్హమ్లోని బయో బబుల్లోకి ప్రవేశించే ముందే వారు అక్కడికి రావాలనుకుంటుంది.'అని ఆ అధికారి చెప్పుకొచ్చాడు.