ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియాకు అనూహ్య పరాజయం ఎదురైంది. వరుస విజయాలతో జోరు కబర్చిన భారత జట్టుకు సౌతాఫ్రికా కోలుకోలేని షాకిచ్చింది. సూపర్-8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో పూర్తి ఆధిపత్యం చెలాయించి ఏకపక్ష విజయంతో భారత్ను మట్టికరిపించింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా సెమీస్ అవకాశాలు మెరుగవ్వగా.. భారత్ అవకాశాలు మాత్రం సంక్లిష్టంగా మారాయి.
ఈ భారీ ఓటమి.. టీమిండియా నెట్రన్రేట్ను దారుణంగా దెబ్బతీసింది. దాంతో సూర్యసేన తదుపరి రెండు మ్యాచ్లకు రెండు గెలిచినా ఇతర జట్ల నెట్రన్రేట్పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ మ్యాచ్ అసాంతం మెరుగైన ప్రదర్శనే చేసిన టీమిండియాను ఒకే ఒక్క ఓవర్ ముంచింది. టీ20 ఫార్మాట్లో మూమెంటమ్ ముఖ్యం. ఒక్కసారి ఊపు అందుకుంటే ఒక్కడైనా జట్టును గెలిపించవచ్చు. అలాంటి మూమెంట్ను ఆ ఓవర్ సౌతాఫ్రికాకు అందించింది.
మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ భాగస్వామ్యం, బ్యాటింగ్ వైఫల్యం భారత్ ఓటమికి కారణమని చెబుతున్నా.. అసలు కారణం మాత్రం టీమిండియా మూమెంటమ్ దెబ్బతీసిన ఆ ఒక్క ఓవరే. ఆ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యానే టీమిండియా విలన్. అతనే జట్టు ఓటమికి ప్రధాన కారణం. అవును అతను వేసిన ఆఖరి ఓవర్లో సౌతాఫ్రికా బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ 20 పరుగులు పిండుకొని మ్యాచ్ మూమెంటమ్ను తమ వైపు తిప్పుకున్నాడు.
ఈ ఓవర్కు ముందు అర్ష్దీప్, బుమ్రా కట్టడిగా బౌలింగ్ చేసి 18 బంతుల్లో 15 పరుగులే ఇచ్చారు. దాంతో సౌతాఫ్రికా 175 పరుగులు చేస్తే గొప్ప అని అంతా అనుకున్నారు. కానీ హార్దిక్ పాండ్యా తన ఆఖరి ఓవర్లో 2, 2, 4, 0, 6, 6లతో 20 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్ను హార్దిక్ కట్టడిగా బౌలింగ్ చేసి 8-10 పరుగులు ఇచ్చి ఉంటే సౌతాఫ్రికా 175-177 పరుగులే పరిమితమయ్యేది.

అప్పుడు భారత బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి ఛేదించేవారు. హార్దిక్ బౌలింగ్లో మూడో బంతికి ట్రిస్టన్ స్టబ్స్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను వాషింగ్టన్ సుందర్ అందుకున్నా.. కనీసం బౌండరీ ఆపినా ఫలితం మరోలా ఉండేది. ఏది ఏమైనా హార్దిక్ పాండ్యా వైఫల్యం టీమిండియా పతనాన్ని శాసించింది. సౌతాఫ్రికాకు భారీ లక్ష్యాన్ని అందించడంతో గట్టిగా పోరాడగలమనే నమ్మకాన్ని ఇచ్చింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. డెవాల్డ్ బ్రెవిస్(29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 45), ట్రిస్టన్ స్టబ్స్(24 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 44 నాటౌట్) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(3/15) మూడు వికెట్లతో సత్తా చాటగా.. అర్ష్దీప్ సింగ్(2/28) రెండు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తీ, శివమ్ దూబే చెరో వికెట్ తీసారు. వరుణ్ చక్రవర్తీ, హార్దిక్ పాండ్యా ధారళంగా పరుగులిచ్చుకున్నారు.
అనంతరం టీమిండియా 18.5 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. శివమ్ దూబే(37 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 42 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్(4/22) నాలుగు వికెట్లు, కేశవ్ మహరాజ్(3/24) మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు. కార్బిన్ బోష్ రెండు వికెట్లు తీయగా.. ఎయిడెన్ మార్క్రమ్ ఒక వికెట్ పడగొట్టాడు.