భారత్, సౌతాఫ్రికా మధ్య నవంబర్ 14 నుంచి రెండు టెస్ట్ల సిరీస్ ప్రారంభం కానుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో మ్యాచ్కు గువాహటి ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ సిరీస్లో టాస్ కోసం ప్రత్యేక గోల్డ్ కాయిన్ ఉపయోగించనున్నారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా ఈ నాణేంను తయారు చేయించింది.
ఈ గోల్డ్ కాయిన్కు ఒకవైపు భారత జాతిపిత మహాత్మ గాంధీ చిత్రం, మరోవైపు జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నల్లజాతి సూరీడు, సౌతాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా చిత్రం ముద్రించారు.
శాంతి, స్వేచ్ఛ, అహింస మార్గంలో నడిచిన ఈ మహనీయుల గౌరవర్థం ఈ ప్రత్యేక నాణెంను రూపొందించారు. ఈ స్పెషల్ కాయిన్ను రెండు మ్యాచ్ల్లో టాస్ సందర్భంగా ఉపయోగించనున్నారు. 2015 నుంచి ఇరు జట్ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్కు మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా ఫీడ్రమ్ ట్రోఫీగా పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆరేళ్ల తర్వాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. దాంతో ఈ మ్యాచ్ కోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే టికెట్లు అన్నీ అమ్ముడైనట్లు తెలుస్తోంది.

న్యూఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో కోల్కతాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే సౌతాఫ్రికా ఆటగాళ్లు భారత్కు రాగా.. వారికి భద్రతను పెంచారు. టీమిండియా ఆటగాళ్ల భద్రతను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇరు జట్ల ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ వద్ద కూడా భద్రత కట్టుదిట్టం చేశారు.
వారు బస చేయనున్న హోటళ్ల వద్ద కూడా పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ను సందర్శించి, భద్రతా ఏర్పట్లను సమీక్షించే అవకాశముంది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు, పోలీసులు భద్రత ఏర్పాట్ల విషయమై సమావేశం కానున్నారు.