
న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్పిన్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ లక్కీ చాన్స్ కొట్టేసాడు. వర్క్లోడ్ నేపథ్యంలో సౌతాఫ్రికా సిరీస్కు దూరమైన పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో టీమిండియా పిలుపును అందుకున్నాడు. అయితే షాబాజ్ అహ్మద్ ఎంపికను బీసీసీఐ దృవీకరించాల్సి ఉంది. మరోవైపు వెన్ను గాయంతో బాధపడుతున్న దీపక్ హుడా, కరోనా నుంచి కోలుకోని మహమ్మద్ షమీ ఈ సిరీస్కు దూరమయ్యారు. షమీ స్థానంలో ఆస్ట్రేలియాతో సిరీస్కు ఎంపికైన మహమ్మద్ షమీ.. సౌతాఫ్రికాతో సిరీస్కు కూడా కొనసాగనుండగా.. దీపక్ హుడా స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ ఓ కథనాన్ని ప్రచురించింది. షాబాజ్ అహ్మద్, శ్రేయస్ అయ్యర్లను జట్టులోకి తీసుకురావాలని సెలెక్షన్ కమిటీ నిర్ణయించినట్లు ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నాడని తెలిపింది.
న్యూజిలాండ్తో అనధికారిక వన్డే సిరీస్లో ఇండియా-ఏ తరఫున సత్తా చాటిన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ రజత్ పటీదార్.. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్కు ఎంపికవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక లెఫ్టాండర్ అయిన షాబాజ్ అహ్మద్.. ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకొనే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్కు కూడా షాబాజ్ అహ్మద్ ఎంపికయ్యాడు. 27ఏళ్ల షాబాజ్ బెంగాల్ తరపున దేశవాళీ మ్యాచ్లలో రాణించాడు. అతను లిస్ట్-A క్రికెట్లో ఇప్పటికే రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో సహా 47.3సగటుతో ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా మ్యాచ్ మలుపు తిప్పే ప్లేయర్ అతను. ఇక షాబాజ్ ఐపీఎల్ 2022లో ఆర్సీబీ తరపున 11ఇన్నింగ్స్లలో 27.38 సగటుతో 219పరుగులతో ఆకట్టుకున్నాడు. జట్టుకు అవసరమైనప్పుడు మిడిల్ ఆర్డర్లో చాలా కీలకమైన పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్లో 4వికెట్లు తీశాడు.