సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ఒకటిన్నర రోజులోనే ముగిసిన ఈ మ్యాచ్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ ఓవర్లలో ఫలితం తేలిన మ్యాచ్గా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్ట్ నిలిచింది.

107 ఓవర్లలోనే ఈ మ్యాచ్ ఫలితం తేలింది. అతి తక్కువ బంతులు బౌలింగ్ చేసిన టెస్ట్ మ్యాచ్గా కూడా చరిత్రకెక్కింది. ఈ క్రమంలో 92 ఏళ్ల రికార్డును ఈ మ్యాచ్ బ్రేక్ చేసింది.

1932లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ 656(109.3 ఓవర్లు) బంతుల్లోనే ముగిసింది. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా.. తాజా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ అధిగమించింది.
ఈ మ్యాచ్ ఫలితం 107 ఓవర్ల( 642 బంతులు)లోనే తేలింది.
అతి తక్కువ బంతుల్లో ఫలితం తేలిన మ్యాచ్లు
642- సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా, కేప్టౌన్, 2024
656- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా, మెల్బోర్న్, 1932
672- వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్, బ్రిడ్జ్టౌన్, 1935
788- ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా, మాంచెస్టర్, 1888
792- ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా, లార్డ్స్, 1888
ఒకటిన్నర రోజు ముగిసిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 23.2 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ సిరాజ్(6/15) ఆరు వికెట్లతో సఫారీ టీమ్ పతనాన్ని శాసించగా... జస్ప్రీత్ బుమ్రా(2/25), ముఖేష్ కుమార్(2/0) రెండేసి వికెట్లతో రాణించారు.
అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు కుప్పకూలింది. ఓ దశలో 153/4 స్కోర్తో పటిష్టంగా కనిపించిన టీమిండియా.. అనంతరం 11 బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోయింది.
భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 46), శుభ్మన్ గిల్(55 బంతుల్లో 5 ఫోర్లతో 36), రోహిత్ శర్మ(50 బంతుల్లో 7 ఫోర్లతో 39)మాత్రమే రాణించారు. సఫారీ బౌలర్లలో కగిసో రబడా(3/38), లుంగి ఎంగిడి(3/30), నండ్రే బర్గర్(3/42) మూడేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 36.5 ఓవర్లలో 176 పరుగులకు కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా(6/61) ఆరు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు.
ఎయిడెన్ మార్క్రమ్(103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 106) సెంచరీతో చెలరేగగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రాకు తోడుగా ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీసారు.
98 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా మార్క్రమ్ సెంచరీతో 78 పరుగులు మాత్రమే అదనంగా చేసింది. దాంతో టీమిండియా ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. పూర్తిగా పేస్కు అనుకూలించే పిచ్ను రెడీ చేసి సౌతాఫ్రికా మూల్యం చెల్లించుకుంది.