సెంచూరియన్: వర్షం అంతరాయం అనంతరం మొదలైన మూడో రోజు ఆటలో భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. సౌతాఫ్రికా పేస్ ద్వయం కగిసో రబడా(3/72), లుంగి ఎంగిడి(6/71) చెలరేగడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 327 పరుగులకే కుప్పకూలింది. ఓవర్ నైట్ స్కోర్కు 55 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా, లుంగి ఎంగిడికి తోడు జాన్సెస్ ఓ వికెట్ తీసాడు.
మూడో రోజు ఆట ఆరంభంలోనే సెంచరీ హీరో కేఎల్ రాహుల్(260 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్తో 123)ను రబడా ఔట్ చేయడంతో భారత వికెట్ల పతనం మొదలైంది. మరో ఓవర్నైట్ బ్యాట్స్మన్ అజింక్యా రహానే(102 బంతుల్లో 9 ఫోర్లతో 48)ను ఎంగిడి కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చడంతో.. క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్(4), రిషభ్ పంత్(8)తో పాటు శార్దూల్ ఠాకూర్(4), మహమ్మద్ షమీ వరుసగా ఔటయ్యారు. దాంతో భారత్ 308 పరుగకులకే 9 వికెట్లు కోల్పోయింది.
అయితే చివరి వికెట్కు మహమ్మద్ సిరాజ్(4 నాటౌట్), జస్ప్రీత్ బుమ్రా(14) 19 పరుగులు జోడించారు. సౌతాఫ్రికా బౌలర్లకు పరీక్షగా నిలిచిన బుమ్రాను జాన్సెన్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు.
272/3 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 5 పరుగులు మాత్రమే చేసి కీలక రాహుల్ వికెట్ కోల్పోయింది. రబడా వేసిన షార్ట్ పిచ్ బాల్ను అంచనా వేయడంలో విఫలమైన రాహుల్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఆ వెంటనే ఎంగిడి బౌలింగ్లో రహానే కూడా కీపర్ క్యాచ్గా ఔటయ్యాడు. 2 పరుగుల దూరంలో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. ఆ తర్వాత కి రవిచంద్రన్ అశ్విన్ను రబడా.. రిషభ్ పంత్ను లుంగి ఎంగిడి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చారు.
ఇక రబడా బౌలింగ్లో బౌండరీతో జోరు కనబర్చిన శార్దూల్ ఠాకూర్ మరుసటి బంతికే కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. లుంగి ఎంగిడి వేసిన మరుసటి ఓవర్లోనే మహమ్మద్ షమీ కూడా కీపర్ క్యాచ్గానే పెవిలియన్ చేరాడు. భారత్ ఇన్నింగ్స్ ముగిసిందనుకుంటున్న తరుణంలో సిరాజ్, బుమ్రా పోరాడారు. బుమ్రా రెండు బౌండరీలు బాదగా.. సిరాజ్ ఓ బౌండరీ బాదాడు. దాంతో సౌతాఫ్రికా బౌలర్లు సహనం కోల్పోయారు. ఇక బంతిని అందుకున్న జాన్సన్ బుమ్రాను ఔట్ చేసి భారత ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు.