
సెంచూరియన్: సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు అసలు సిసలు సమరానికి సిద్దమైంది. మూడు టెస్ట్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ రేపు(ఆదివారం) సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానుంది. సొంతగడ్డపై న్యూజిలాండ్తో టీ20, రెండు టెస్ట్ల సిరీస్ను గెలుచుకున్న భారత్.. అదే జోరులో సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ గెలిచి సత్తా చాటాలనుకుంటుంది. ఇప్పటి వరకు నెరవేరని కలను ఈ సారి ఎలాగైనా సాకరం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ఆ దిశగా సన్నదమైన భారత ఆటగాళ్లు నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చారు.
పేపర్పై అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్న భారత్కు జట్టు కూర్పు ఒక్కటే సమస్యగా మారింది. యువ ఆటగాళ్లు సత్తా చాటుతుండటం.. సీనియర్ ఆటగాళ్లు రీఎంట్రీ ఇస్తుండటంతో తుది జట్టులో ఎవరికీ చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మిడిలార్డర్లో ఒక్క స్థానం కోసం అజింక్యా రహానే, హనుమ విహారి, శ్రేయస్ అయ్యర్ పోటీపడుతున్నారు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే ఈ ముగ్గురిలో ఒకరికే అవకాశం దక్కనుంది. ఎక్స్ ట్రా బ్యాట్స్మన్ కావాలనుకుంటే మాత్రం ఇద్దరికీ చోటు దక్కవచ్చు.
సౌతాఫ్రికా పర్యటనలోని ఈ మ్యాచ్లను అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్షప్రసారం చేయనుంది. తమ అనుబంధ చానెల్స్తో పాటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డీస్నీ హాట్స్టార్లో ఈ మ్యాచ్లను చూడవచ్చు. ఇప్పటికే స్టార్ స్పోర్ట్స్ అన్ని ఏర్పాట్లు చేసింది. స్టార్ స్పోర్ట్స్ 1, 2, 3తో పాటు స్థానిక భాషల్లోని తెలుగు, తమిళం, కన్నడ చానెళ్లో కూడా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్లో భారత్ ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే కేఎల్ రాహుల్ హింట్ ఇచ్చాడు. అదే జరిగితే జస్ప్రీత్ బుమ్రా, మమమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్తో పాటు బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వస్తాడు. ఏకైక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడుతాడు. రోహిత్ శర్మ గాయంతో దూరమవడంతో మయాంక్ అగర్వాల్తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. ఫస్ట్ డౌన్లో చతేశ్వర్ పుజారా, నాలుగులో కోహ్లీ బరిలోకి దిగుతారు. ఆ తర్వాత రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ ఆడనున్నారు.
భారత తుది జట్టు (అంచనా)
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్/అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్