
సెంచూరియన్: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆట సజావుగా సాగనుంది. వర్షం కారణంగా రెండో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయిన విషయం తెలిసిందే. సోమవారం విరామం ఇవ్వకుండా వర్షం కురువడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. అయితే ప్రస్తుతం సెంచూరియన్లో వర్షం కురవడంలేదు. బాగా ఎండ కొడుతుంది.
మధ్యాహ్నం తర్వాత మబ్బులు కమ్మే అవకాశం ఉంది తప్పా వర్ష సూచనలేదని వాతావరణ అధికారులు తెలిపారు. దాంతో మూడో రోజు ఆట నిర్ణీత సమయం ప్రకారమే ప్రారంభం కానుంది. ఓ అరగంట ముందుగానే మ్యాచ్ను ప్రారంభించనున్నారు. రెండో రోజు కోల్పోయిన ఓవర్లను వీలైనంత వరకు మళ్లీ ఆడించే ప్రయత్నం చేయనున్నారు.
ఈ నేపథ్యంలోనే నేడు అదనంగా 8 ఓవర్లు వేయించనున్నారు. మ్యాచ్ మూడో రోజు ఆట టైమింగ్స్ను బీసీసీఐ ట్వీట్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 3 వికెట్లకు 272 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (248 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్తో 122 బ్యాటింగ్), అజింక్య రహానే (81 బంతుల్లో 8 ఫోర్లతో 40 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఈ టెస్టు మూడు, నాలుగు రోజుల్లో ఎలాంటి వర్ష సూచన లేదు. ఆట పూర్తి స్ధాయిలో సజావుగా సాగే అవకాశం ఉంది. అయితే చివరి రోజైన గురువారం కూడా వాన పడే అవకాశం ఉందని నిపుణులు చెబు తున్నారు.
అదే జరిగితే నాలుగు ఇన్నింగ్స్ల ఆట సాగడం దాదాపు అసాధ్యమే. పైగా ఇప్పటి వరకు స్పందిస్తున్న తీరు చూస్తే పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలంగా ఉంది. ఒక్కసారిగా వికెట్లు కుప్పకూలిపోయే పరిస్థితి కూడా కనిపించడం లేదు. టీమిండియాకు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే ఆట సాగితే కచ్చితంగా మనదే పైచేయి అయి ఉండేది. సఫారీ గడ్డపై తొలిసారి సిరీస్ గెలవాలని కోరు కుంటున్న భారత్కు వర్షం వల్ల మ్యాచ్లో ఆశించిన ఫలితం రాకపోతే మాత్రం తీవ్ర నిరాశ తప్పదు.