
ధర్మశాల: భారత్, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి వన్డేకు వరణుడు అడ్డంకిగా మారాడు. దీంతో మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. గురువారం తెల్లవారు జాము 3 గంటలకు వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దీంతో టాస్ ఆలస్యం అయింది. అనంతరం వర్షం లేకపోవడంతో.. సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేయడానికి తీవ్రంగా శ్రమించారు. ఈ లోపు మరోసారి వర్షం రావడంతో వారి కష్టం అంతా వృథా అయింది.
ఇక ఓవైపు వర్షం.. మరో వైపు కరోనా వైరస్ భయంతో ప్రేక్షకుల్లేక మైదానం బోసిపోయింది. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయం అయినా.. ప్రేక్షకులు ఇంకా మైదానం చేరుకోకపోవడం గమనార్హం. దీంతో మైదానంలోని సీట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.
ఓపెనర్గా పృథ్వీకే చాన్స్..
రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో శిఖర్ ధావన్తో పృథ్వీషానే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ పర్యటనలో షా విఫలమైనా.. శుభ్ మన్ గిల్ జట్టులో ఉన్నా.. ముంబై క్రికెటర్కే టీమ్మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక అతను కూడా నెట్స్తో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు.