R Ashwin: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నామని ప్రకటించిన పాకిస్థాన్పై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ నీచపు బుద్దే ఈ వివాదానికి కారణమని తెలిపాడు. నాలుగు రోజుల్లో పాక్ దారికొస్తుందని అభిప్రాయపడ్డాడు. కచ్చితంగా భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుందని, ఆ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు.
భద్రతా కారణాల నేపథ్యంలో భారత్లో పర్యటించలేమని, తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. దాంతో ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకోగా.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్కు ఐసీసీ అవకాశం కల్పించింది. అయితే ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తప్పుబట్టింది. బంగ్లాదేశ్కు సంఘీభావంగా భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

తాజాగా ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. పాకిస్థాన్ తీరును తప్పుబట్టాడు. 'వందకు 100 శాతం భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుంది. మరో నాలుగైదు రోజుల్లో పాకిస్థాన్ దారికొస్తుంది. భారత్, పాక్ మ్యాచ్ చూడాలని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఒకవేళ భారత్తో మ్యాచ్ ఆడకుంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకే భారీ నష్టం వాటిల్లుతుంది. బ్రాడ్కాస్టర్లు పెద్ద మొత్తాల్లో నష్టపోతారు. మిగతా బోర్డులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఐసీసీ మీటింగ్లో కూడా ఈ విషయం ప్రస్తావనకు వస్తుంది. పీఎస్ఎల్ కోసం విదేశీ ఆటగాళ్లకు ఎన్ఓసీలు రావు. మిగతా క్రికెట్ బోర్డులు కూడా పాకిస్థాన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. ఇప్పటికే ఇరు దేశాల క్రికెట్ బోర్డుల ఒప్పందాల్లో భాగంగా తటస్థ వేదికల్లో తలపడుతున్నాయి. కాబట్టి ఓ ప్రత్యర్థితో నేను ఆడను అనడం ఆమోదయోగ్యం కాదు. పాకిస్థాన్కు పాకిస్థానే పెద్ద శత్రువు. దీనంతటికీ వారి నీచపు బుద్దే కారణం.'అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆదివారం ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఆదివారం అమెరికాతో జరిగే తొలి మ్యాచ్తో టీమిండియా తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది.