ప్రపంచ క్రికెట్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాయాదుల సమరంపై యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తి కనబరుస్తోంది. క్రికెట్ను మతంగా భావించే భారత్లో అయితే జనాలంతా టీవీలకు అతుక్కుపోతారు. పాకిస్థాన్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం లేదు. కేవలం ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లోనే భారత్, పాక్లు తలపడుతున్నాయి. దాంతో దాయాదుల సమరంపై మరింత ఆసక్తి పెరిగింది.
ఈ మ్యాచ్ చుట్టూ వందల కోట్ల వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. అందుకే ఐసీసీ ప్రతీ మెగా టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ రూపొందిస్తుంది. ఈ ఇరు జట్లు ఒకే గ్రూప్లో ఉండేలా సీడింగ్ తీస్తోంది. అలాంటిది భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
మెగా టోర్నీలో ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ను అనుమతిచ్చిన ఆ దేశ ప్రభుత్వం.. భారత్తో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరించాలని సూచించింది. దాంతో ఐసీసీ తీవ్రంగా స్పందించింది. ఇది కేవలం రాజకీయ అంశం కాదని, దీని వెనుక భారీ ఆర్థిక లెక్కలున్నాయని హెచ్చరిస్తూ ఓ ప్రకటనను విడదుల చేసింది.
ఇది కేవలం ఒక క్రీడా ఘట్టం కాదని, యావత్ టోర్నమెంట్కు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచే అంశమని, ప్రసార హక్కుల విలువను నిర్దేశించే, చిన్న దేశాల క్రికెట్ బోర్డులకు నిధులు సమకూర్చే ఈ మ్యాచ్ను నిర్వహించడం ఐసీసీకి అత్యంత కీలకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే ఒక టీ20 మ్యాచ్ విలువ అక్షరాలా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,500 కోట్లు) అంట.
బ్రాడ్కాస్టింగ్ రైట్స్, యాడ్స్ రెవెన్యూ, స్పాన్సర్షిప్, టికెటింగ్, బెట్టింగ్ వంటి అన్ని వాణిజ్య కార్యకలాపాలను కలిపితే ఈ స్థాయిలో ఆదాయం సమకూరుతుందని బిజినెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ క్రికెట్లో మరే మ్యాచ్కూ ఇంతటి ఆర్థిక విలువ లేదంట. ప్రసారకర్తలకు ఈ మ్యాచ్ ఒక బంగారు బాతు లాంటిదని, ఈ మ్యాచ్ సమయంలో 10 సెకన్ల యాడ్ స్లాట్కు రూ. 25 లక్షల నుంచి రూ. 40 లక్షలు వసూలు చేస్తారని, ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే, టోర్నీ ఆర్థిక స్వరూపమే మారిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్-పాక్ మ్యాచ్ జరగకపోతే నష్టపోయే వారి సంఖ్య భారీగానే ఉంది. ఇందులో ఒక్క బ్రాడ్ కాస్టర్ జియో హాట్స్టార్ ప్రకటనల ఆదాయం రూ.300 కోట్లు నష్టపోనుంది. అదే జరిగితే ఐసీసీ నుంచి జియో హాట్స్టార్ నష్టపరిహారం కోరనుంది. అప్పుడు ఐసీసీ సభ్య దేశాలకు అందించే ఆదాయంలో కోత విధించి బ్రాడ్కాస్టర్కు చెల్లించాల్సి వస్తుంది.
అప్పుడు భారత్, పాకిస్థాన్తో పాటు ఐసీసీ నిధులపై ఆధారపడిన చిన్న దేశాలు కూడా తీవ్రంగా నష్టపోతాయి. ఒకవేళ భారత్, పాక్ మ్యాచ్ రద్దయితే బీసీసీఐ, పీసీబీలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా చెరో రూ.200 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. ఇది బీసీసీఐకి పెద్ద నష్టం కాకపోయినా.. పీసీబీ మాత్రం పూర్తిగా కుదేలవ్వనుంది.
ఐసీసీ మొత్తం ఆదాయంలో పీసీబీకి 5.75 శాతం వాటా కింద ఏడాదికి సుమారు 34.51 మిలియన్ డాలర్లు అందుతుంది. ఈ డబ్బు రావాలంటే పీసీబీ.. ఐసీసీ రూల్స్ పాటించాలి. అంతేకాకుండా ఓ మ్యాచ్ బాయ్కట్ చేస్తే ఇన్సూరెన్స్ కూడా రాదు. ఐసీసీ సభ్యుల భాగస్వామ్య ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు టోర్నీ చెల్లింపులను నిలిపివేయడం, అదనపు జరిమానాలు విధించడం, ప్రసారకర్తల నుంచి దావాలను ఎదుర్కోవడం వంటి తీవ్ర పరిణామాలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆర్థిక నష్టం కంటే పాకిస్థాన్ను భవిష్యత్తులో మరే బ్రాడ్కాస్టర్ ఆ దేశాన్ని నమ్మే పరిస్థితి ఉండదు. అప్పుడు ప్రసార హక్కుల విలువ దారుణంగా పడిపోతుంది. మరోవైపు కేవలం భారత్-పాక్ మ్యాచ్ కోసమే విమానాలు, హోటళ్లు బుక్ చేసుకున్న వేలాది మంది అభిమానులు తీవ్రంగా నష్టపోనున్నారు.