ఐసీసీ టోర్నీల్లో తరుచూ భారత్, పాకిస్థాన్ మ్యాచ్లు నిర్వహించడంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్థిక లాభం కోసం ఐసీసీ టోర్నీల్లో ఒకే గ్రూప్లో భారత్, పాకిస్థాన్లను చేర్చి మ్యాచ్లు నిర్వహించడం సరికాదన్నాడు. ఇక నుంచి ఐసీసీ టోర్నీల్లో ప్రతీ సారి భారత్, పాక్ మ్యాచ్లు పెట్టొద్దని సూచించాడు. లేకపోతే అభిమానుల్లోనూ ఈ మ్యాచ్లపై ఆసక్తి పోతుందని హెచ్చరించాడు.
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య తరుచూ ఐసీసీ, ఏసీసీ ఈవెంట్స్లో మ్యాచ్లో జరిగేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. తద్వారా ఆర్థికంగా లాభం వస్తుందని, బ్రాడ్కాస్టింగ్ రూపంలో కోట్ల రూపాయాలు వస్తాయని క్రికెట్ బోర్డులు, ఐసీసీ భావించి ఇలా చేస్తోంది. 2023-27 సైకిల్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ల బ్రాడ్కాస్టింగ్ విలువ సుమారుగా 3 బిలియన్ డారల్లుగా ఉంది.

అయితే రాను రాను పాకిస్థాన్ జట్టు ప్రదర్శన మరీ దారుణంగా తయారైంది. భారత్కు కనీస పోటీ ఇవ్వలేకపోతుంది. అంతేకాకుండా ఇరు జట్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుంది. ఈ క్రమంలోనే భారత్, పాక్ మ్యాచ్లను ప్రతీసారి నిర్వహించవద్దని మైక్ అథర్టన్ సూచించాడు.
'ఐసీసీ టోర్నీల్లో భారత్-పాక్ మ్యాచ్లు పెట్టడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఈ మ్యాచ్లు అపారమైన ఆర్థిక విలువను కలిగి ఉన్నాయి. ఈ మ్యాచ్కు సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ద్వారా ఐసీసీ సుమారు 3 బిలియన్ల డాలర్ల ఆదాయం సమకూరింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు లేకపోవడంతో ఐసీసీ టోర్నీల్లో జరిగే మ్యాచ్లకు ప్రాధాన్యత పెరిగింది. ఐసీసీకి ప్రధాన ఆదాయ వనరుగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చాలా అవసరం.
చాలా ఏళ్లుగా ఐసీసీ టోర్నీలో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్లో ఉన్నాయి. ఇది యాదృచ్చికం కాదు. ప్రతీ టోర్నీలో కనీసం ఒక ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరిగేలా గ్రూప్స్ను ఉద్దేశపూర్వకంగా డ్రా తీసారనేది అందరికీ తెలిసిన రహస్యం.
ఒకప్పుడు క్రికెట్ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు వారధిగా ఉండేది. కానీ ఇప్పుడు అది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, రాజకీయ ప్రచారానికి ప్రతిరూపంగా మారింది. ఆర్థిక అవసరాల కోసం ఒక టోర్నీనీ, మ్యాచ్లను నిర్వహించడం సరికాదు. భవిష్యత్తులో ఐసీసీ టోర్నీలకు సంబంధించిన డ్రాలను బహిరంగంగా తీయాలి. భారత్, పాక్లు ఒకే గ్రూప్లో లేకపోయినా పర్వాలేదు. డబ్బు కాదు.. ఆట స్ఫూర్తి ముఖ్యం.'అని అథర్టన్ చెప్పుకొచ్చాడు.