కొలంబో: ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-పాకిస్థాన్ సూపర్-4 మ్యాచ్ ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్డే అయిన నేటికి(సోమవారం) వాయిదా పడిన విషయం తెలిసిందే. రిజర్వ్ డే రోజు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో గంటా 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఎలాంటి ఓవర్లను కుదించకుండా మ్యాచ్ను కొనసాగిస్తున్నారు.
షాదాబ్ ఖాన్ తన ఓవర్ను పూర్తి చేయగా.. కోహ్లీ, రాహుల్ భారత ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నారు. పాకిస్థాన్ స్టార్ పేసర్ హ్యారీస్ రౌఫ్ ఈ మ్యాచ్లో బౌలింగ్ చేయడం లేదు. ఆదివారం 5 ఓవర్లు బౌలింగ్ చేసిన హ్యారీస్ రౌఫ్.. ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కోవడంతో మిగిలిన 5 ఓవర్లు బౌలింగ్ చేయడం లేదు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఫియోల సూచనల మేరకు హ్యారీస్ రౌఫ్ బౌలింగ్కు దూరంగా ఉన్నాడు.

ఎట్టకేలకు మ్యాచ్ ప్రారంభం కావడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వర్షం రావద్దని కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 24.1 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్మన్ గిల్ (58)అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. అయితే ఈ ఇద్దరూ వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. రోహిత్ శర్మను షాదాబ్ ఖాన్ ఔట్ చేయగా.. శుభ్మన్ గిల్ను షాహిన్ అఫ్రిది పెవిలియన్ చేర్చాడు.
ప్రస్తుతం క్రీజులో ఉన్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(9 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(20 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నారు. వర్షం హెచ్చరికల నేపథ్యంలో టీమిండియా ధాటిగా ఆడాల్సిన అవసరం ఉంది. మళ్లీ వర్షం అంతరాయం కలిగిస్తే.. డక్వర్త్ లూయిస్ ప్రకారం లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే టీమిండియా రన్ రేట్ తగ్గకుండా ఆడాల్సి ఉంది.
తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రెండో ఇన్నింగ్స్లో కనీసం 20 ఓవర్ల మ్యాచ్ జరిగితేనే డీఎల్ఎస్ విధానంలో విజేతను నిర్ణయిస్తారు. ఒకవేళ వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ కనీసం 20 ఓవర్లు కూడా జరగకపోతే మ్యాచ్ను రద్దు చేస్తారు.