ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్తో హైఓల్టేజ్ మ్యాచ్కు భారత్ సన్నదమైంది. మరో 24 గంటల్లో దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్కు తెరలేవనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తుండగా.. భారత్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్ను బాయ్కట్ చేయాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పిలుపునిస్తున్నారు. మరికొందరు మాత్రం మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు.
గత చరిత్ర చూసుకున్నా.. ప్రస్తుత ఫామ్ను పరిగణలోకి తీసుకున్నా టీమిండియానే హాట్ ఫేవరేట్గా కనిపిస్తోంది. టీ20ల్లో టీమిండియా వరల్డ్ ఛాంపియన్గా ఉండగా.. పాకిస్థాన్ 8వ స్థానంలో ఉంది. అంతేకాకుండా పాక్లో సీనియర్ ఆటగాళ్లు ఎవరూ లేరు. ఆ జట్టు పూర్తిగా కుర్రాళ్లతో ఉంది. మరోవైపు భారత్.. వరల్డ్ బెస్ట్ టీ20 ప్లేయర్లతో భీకరంగా కనిపిస్తోంది. కానీ ప్రస్తుత భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్లకు మినహా పాక్పై ఏ ఒక్కరికి మెరుగైన గణంకాలు లేవు. అర్ష్దీప్ సింగ్కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం లేదు. అంటే బుమ్రా ఒక్కడికి మాత్రమే పాక్పై మెరుగైన రికార్డు ఉంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జట్టులో సగం మంది ఆటగాళ్లకు అయితే పాక్పై ఆడిన అనుభవం కూడా లేదు. ఈ గణంకాలు భారత అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

టీమిండియా యువ ఓపెనర్, వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, వరల్డ్ నెంబర్ 2 తిలక్ వర్మ, వికెట్ కీపర్ సంజూ శాంసన్, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్లు ఇప్పటి వరకు పాకిస్థాన్తో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆదివారం జరగబోయే మ్యాచే వీరికి పాక్పై తొలి మ్యాచ్ కానుంది. సంజూ శాంసన్ గత 10 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నా.. అతనికి పాక్తో ఆడే అవకాశం ఒక్కసారి కూడా రాకపోవడం గమనార్హం. 41 టీ20లు ఆడిన కుల్దీప్ యాదవ్కు కూడా పాక్పై ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. ఈ అనుభవం లేమి.. వారి ప్రదర్శనపై ప్రభావం చూపనుందా? అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు పాక్పై చెత్త రికార్డ్ ఉంది. ఇప్పటి వరకు పాకిస్థాన్పై 5 మ్యాచ్లు ఆడిన సూరీడు.. 12 యావరేజ్, 118 స్ట్రైక్రేట్తో 64 పరుగులు మాత్రమే చేశాడు. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రికార్డ్ మాత్రం మిశ్రమంగా ఉంది. బ్యాటింగ్లో మెరుగైన గణంకాలు లేకున్నా.. బౌలింగ్లో అద్భుత రికార్డ్ ఉంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన హార్దిక్ పాండ్యా.. 18 సగటుతో 91 పరుగులే చేశాడు. బౌలింగ్లో మాత్రం 13 వికెట్లు పడగొట్టాడు. రెండు మ్యాచ్లు ఆడిన అక్షర్ పటేల్ 20 పరుగులే చేసి ఒక వికెట్ తీసాడు. జస్ప్రీత్ బుమ్రా 4 మ్యాచ్లు ఆడి 5 వికెట్లే తీసాడు. అతని ఎకానమీ 5.42 మాత్రమే. అర్ష్దీప్ సింగ్ మాత్రం 4 మ్యాచ్ల్లో 7.85 ఎకానమీతో 7 వికెట్లు తీసాడు.