న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యధిక వ్యూస్ రాబట్టిన మ్యాచ్గా చరిత్రకెక్కింది. ఆసియాకప్ 2023లో భాగంగా దాయాదీ దేశాల మధ్య జరిగిన మ్యాచ్కు గరిష్టంగా 2 కోట్ల 80 లక్షల రియల్ టైమ్ వ్యూస్ వచ్చాయి. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించినా.. అత్యధిక వ్యూస్ రావడం విశేషం.
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలు చేసిన సమయంలో ఈ బ్లాక్బాస్టర్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు హాట్ స్టార్లో ఇదే అత్యధిక రికార్డు. 2019 వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్కు గరిష్టంగా 2 కోట్ల 53 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా.. తాజాగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అధిగమించింది.

ఈ సారి సబ్స్క్రిప్షన్ లేకుండా హాట్స్టార్లో మ్యాచ్లు చూసే అవకాశం ఉండటంతో ఈ రికార్డు వ్యూస్ వచ్చాయి. ఆసియాకప్ ఫైనల్, ప్రపంచకప్లోనూ ఫ్రీగా చూసే ఆస్కారం ఉండటంతో.. తాజా రికార్డు కూడా బద్దలయ్యే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ సెంచరీ చేయగానే.. హాట్ స్టార్ వ్యూస్ అమాంతం 80 లక్షలు పెరగడం విశేషం.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 111 నాటౌట్), విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 122 నాటౌట్) అజేయ సెంచరీలతో చెలరేగగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ(49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 56), శుభ్మన్ గిల్(52 బంతుల్లో 10 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు.
పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 77 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇమామ్ ఉల్ హక్(9), బాబర్ ఆజామ్(10), మహమ్మద్ రిజ్వాన్(2), ఫకార్ జమాన్(27) దారుణంగా విఫలమయ్యారు. ఇఫ్తికర్ అహ్మద్, అఘా సల్మాన్ పోరాడుతున్నారు.