యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్లో ఈ దాయాదీ దేశాలు అమీతుమీ తేల్చుకోనున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పోరును క్రికెట్ మ్యాచ్లా కాకుండా ఓ యుద్దంలా ఇరు దేశాల అభిమానులు భావిస్తున్నారు. ఇరు దేశాల అభిమానుల భావోద్వేగాలతో ఈ మ్యాచ్ ముడిపడటంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా సిద్దమవుతున్నాయి.
అయితే గత చరిత్ర చూసుకున్నా.. ప్రస్తుత ఫామ్ను పరిగణలోకి తీసుకున్నా టీమిండియానే హాట్ ఫేవరేట్గా కనిపిస్తోంది. టీ20ల్లో టీమిండియా వరల్డ్ ఛాంపియన్గా ఉండగా.. పాకిస్థాన్ 8వ స్థానంలో ఉంది. అంతేకాకుండా పాక్లో సీనియర్ ఆటగాళ్లు ఎవరూ లేరు. ఆ జట్టు పూర్తిగా కుర్రాళ్లతో ఉంది. మరోవైపు భారత్.. వరల్డ్ బెస్ట్ టీ20 ప్లేయర్లతో భీకరంగా కనిపిస్తోంది. అయితే టీ20 ఫార్మాట్లో ఏ జట్టును తక్కువ అంచనా వేయలేం. అంతేకాకుండా భారత్-పాక్ మ్యాచ్ అంటే ఒత్తిడితో కూడిన పోరు. ఎవరు ఈ ఒత్తిడిని అధిగమిస్తే ఆ జట్టునే విజయం వరిస్తుంది.

ఆసియా కప్ , టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్.. ఏదీ తీసుకున్నా పాక్పై భారత్దే పై చేయి. ముఖ్యంగా ఆసియా కప్లో భారత్దే పూర్తి ఆధిపత్యం. 1984లో ఈ టోర్నీ మొదలవ్వగా..ఇప్పటి వరకు 16 ఎడిషన్స్ జరిగాయి. ఇందులో భారత్, పాకిస్థాన్ 15 ఎడిషన్స్ ఆడాయి. అత్యధికంగా భారత్ 8 సార్లు విజేతగా నిలిస్తే పాకిస్థాన్ కేవలం రెండు సార్లు మాత్రమే గెలుపొందింది. శ్రీలంక 6 సార్లు గెలిచింది. భారత్, పాకిస్థాన్ ఆడిన 15 ఎడిషన్లలో ఇరు జట్లు ఒక్కసారి కూడా ఫైనల్లో తలపడలేదు.
ఓవరాల్గా ఇరు జట్ల మధ్య 18 మ్యాచ్లు జరగ్గా.. భారత్ 10 గెలిచింది. పాకిస్థాన్ 6 గెలవగా.. రెండు మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. టీ20 ఫార్మాట్లో 3 సార్లు తలపడగా.. భారత్ రెండు సార్లు గెలిచింది. పాకిస్థాన్ ఒకే ఒక్కసారి గెలుపొందింది. ఈ రికార్డులే టీమిండియా ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఐదేళ్లలో భారత్, పాక్ టీ20ల్లో ఐదు సార్లు తలపడగా భారత్ 3-2తో ఆధిక్యంలో ఉంది.
భారత్: శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, జితేష్ శర్మ, హర్షిత్ రాణా, రింకూ సింగ్.
పాకిస్థాన్: సల్మాన్ అలీ అఘా(కెప్టెన్), అబ్రర్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకార్ జమాన్, హ్యారీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ టలట్, ఖుష్దిల్ షా, మహమ్మద్ హరీస్(కీపర్), మహమ్మద్ నవాజ్, మహమ్మద్ వసీం జూనియర్, సహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయుబ్, సల్మాన్ మిర్జా, షాహిన్ షా అఫ్రిది, సుఫ్యన్ మోఖిమ్