
సౌతాంప్టన్: 144 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ఎన్నో వందల టెస్ట్లు.. మరెన్నో అపురూప విజయాలు.. ఇంకెన్నో ఘనతలు.. లెక్కలేనన్ని మైల్ స్టోన్స్.. ఎందరో లెజెండ్స్.. అందరూ ఆటను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు ఒకే ఒక్క మ్యాచ్తో శిఖరం చేరే సమయం ఆసన్నమైంది. ఘన వారసత్వానికి కొనసాగింపుగా.. జెంటిల్మన్ గేమ్లో అతిపెద్ద అడుగు ముందుకు పడబోతున్నది. ఉత్కంఠ రేపే సిరీస్లున్నా.. నరాలు బిగపట్టి చూసిన మ్యాచ్లకు కొదవలేకున్నా.. ఒకే ఒక్క మ్యాచ్ మాత్రం ఇప్పుడు క్రికెట్ ప్రపంచం తనవైపు తిప్పుకుంది.
అదే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్. లిమిటెడ్ ఓవర్లలో ఫార్మాట్కో వరల్డ్ కప్ ఉన్నా.. ట్రెడిషనల్ గేమ్కు మాత్రం ఇప్పటి వరకు ప్రపంచ స్థాయి ట్రోఫీ మాత్రం లేదు. ఇప్పుడు ఆట్రోఫీ(గద)ని అందుకునేందుకు భారత్, న్యూజిలాండ్ సిద్దమయ్యాయి. ఒకరిదేమో దూకుడు.. మరొకరిదేమో నిలకడ.. ఈ రెండింటి మధ్య అగ్గి పుట్టించే అసలు సిసలైన పోరాటం కోసం అటు విరాట్ కోహ్లీ, ఇటు కేన్ విలియమ్సన్ రెడీ అయ్యారు. మరికొద్ది గంటల్లోనే ఈ మెగా పోరు షురూ కానుంది.
కానీ అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్న ఈమ్యాచ్పై వరుణుడు నీళ్లు చల్లుతున్నాడు. మ్యాచ్ జరగనున్న సౌతాంప్టన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి కూడా వర్షం పడటంతో మైదానాన్ని కవర్లతో కప్పెసారు. అంతేకాకుండా సౌథాంప్టన్లో వచ్చే ఆరు రోజులూ వర్షాలు పడొచ్చంటూ బ్రిటన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ (UK Met) వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో వెదర్ వార్నింగ్ (Yellow weather warning)ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేసింది. సౌథాంప్టన్ మొత్తంగా ఓ మోస్తరు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వచ్చే వారం రోజులూ ఇదే తరహా వాతావరణం సౌథాంప్టన్లో ఉండటానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం అక్కడ 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడంతో పాటు.. చిరుజల్లులు పడుతున్నాయని తెలిపింది.
గంటకు పైగా ఏకధాటిగా కురిసిన వర్షం వల్ల ఏజెస్ బౌల్ స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. బురదమయమైంది. పిచ్ డ్యామేజ్ కాకుండా గ్రౌండ్ స్టాఫ్ దాన్ని కప్పి ఉంచారు. ఔట్ ఫీల్డ్లో వర్షపు నీళ్లు నిలిచాయి. వర్షం పూర్తిగా తొలగిపోతే గానీ.. దాన్ని ఆరబెట్టే చర్యలను తీసుకోలేకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తొలి రోజు ఆట సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడంలేదు. దాదాపు తొలి రోజు ఆట తుడిచి పెట్టుకుపోయినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ రిజర్వ్ డే ఉన్న విషయం తెలిసిందే. అయితే మరో వారం రోజుల పాటు అక్కడ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ఏ రోజు ఎన్ని ఓవర్ల ఆట సాధ్యమయ్యే విషయాన్ని ఎక్స్పర్ట్స్ వెల్లడించారు.
వర్షంతో తొలి రోజు తుడిచిపెట్టుకుపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రెండో రోజు వర్షం అంతరాయం కలిగినా.. ఆట సాగే అవకాశం ఉంది. అదే జరిగితే కొంచెం ముందుగానే మ్యాచ్ ప్రారంభిస్తే.. 98 ఓవర్ల ఆటను కొనసాగించవచ్చంటున్నారు. ఈ లెక్కనే వర్షం అంతరాయం కలిగించినా మూడో రోజు 50- 70 ఓవర్లు, నాలుగో రోజు 30-50 ఓవర్లు, ఐదో రోజు 98 ఓవర్లు, ఆరో రోజు 98 ఓవర్లు జరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే తొలి రోజులానే నాలుగో రోజు కూడా ఆట సాగమన్నారు. ఇక హర్ష భోగ్లే సైతం మ్యాచ్ సాధ్య సాధ్యలపై వరుస ట్వీట్లు చేశాడు.