
ముంబై: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 221/4 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. కివీస్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్.. ఓకే ఓవర్లో రెండు వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బతీసాడు. ఆజాజ్ స్పిన్ ధాటికి వృద్దిమాన్ సాహా తన ఓవర్ నైట్ స్కోర్కు 2 పరుగులు మాత్రమే జత చేసి పెవిలియన్ చేరాడు. రెండో రోజు రెండో ఓవర్లోనే సాహాను వికెట్ల ముందు బోల్తా కొట్టించిన ఆజాజ్.. ఆ మరుసటి బంతికే క్రీజులోకి వచ్చిన అశ్విన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఈ బంతిని అంచనా వేయడంలో విఫలమైన అశ్విన్.. గోల్డెన్ డక్గా తెల్ల మొహం వేస్తూ పెవిలియన్ బాట పట్టాడు. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్తో కలిసి సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ ఆచితూచి ఆడుతున్నాడు. మరోవైపు అక్షర్ పటేల్ సైతం అతనికి సహకారం అందిస్తున్నాడు.
ఇక ఇప్పటి వరకు టీమిండియా కోల్పోయిన 6 వికెట్లను ఆజాజ్ పటేల్ తీయడం విశేషం. తొలి రోజు ఆటలో నాలుగు వికెట్లు తీసిన ఆజాజ్ రెండో రోజు ఆట ప్రారంభంలోనే మరో రెండు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం దక్కినా.. ఆజాజ్ పటేల్ ధాటికి క్రీజులో కుదురుకున్న శుభ్మన్ గిల్(42), చతేశ్వర్ పుజారా(0), విరాట్ కోహ్లీ(0) వరుస ఓవర్లలో ఔట్ చేసి భారత్ను కష్టాల్లోకి నెట్టాడు.
ఆ తర్వాత అరంగేట్ర టెస్టులో సెంచరీ, హాఫ్ సెంచరీతో అదరగొట్టిన శ్రేయస్ను కూడా ఆజాజ్ పెవిలియన్ చేర్చడంతో భారత కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఈ పరిస్థితుల్లో కూడా భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి 221/4 స్కోర్ చేసిందంటే.. దానికి కారణం మయాంక్ అగర్వాల్. ఈ మ్యాచ్ ముందు వరకూ జట్టులో తన స్థానాన్ని ప్రశ్నించిన వాళ్లకు అద్భుత శతకంతో సమాధానమిచ్చాడు. తాను క్రీజులో నిలబడి.. జట్టునూ నిలబెట్టాడు. మరోవైపు తడి ఔట్ఫీల్డ్ కారణంగా మొదటి రోజు ఆటలో తొలి సెషన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.