
వెల్లింగ్టన్: టీమిండియా యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ రాకరాక వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న నాలుగో టీ20లో ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ కేరళ బ్యాట్స్మన్ దారుణంగా విఫలమయ్యాడు. 5 బంతుల్లో కేవలం 8 పరుగులే చేసి నిరాశపరిచాడు.
ఇక సొంతగడ్డపై శ్రీలంకతో సిరీస్లో చివరి టీ20 ఆడి రెండు బంతుల్లోనే వెనుదిరిగిన శాంసన్... ఐదేళ్ల తర్వాత దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో టీమ్మేనేజ్మెంట్ మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అతని అభిమానులు టీమ్మేనేజ్మెంట్పై దుమ్మెత్తి పోశారు. నాలుగేళ్ల తర్వాత ఒక్క మ్యాచ్ అవకాశం ఇచ్చి తీసేస్తారా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్కు కూడా శాంసన్ను తొలుత ఎంపికచేయలేదు. అయితే శిఖర్ ధావన్ అనూహ్యంగా గాయపడటంతో మళ్లీ పిలుపు అందుకున్న శాంసన్.. గత మూడు మ్యాచ్లు అవకాశం కోసం నిరీక్షించాడు.
ఇక అద్భుత ప్రదర్శనతో వరుసగా విజయాలందుకున్న కోహ్లీసేన నాల్గో మ్యాచ్లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇస్తూ ప్రయోగాలకు తెరలేపింది. స్టార్ ఓపెనర్, హిట్ మాన్ రోహిత్ శర్మకు విశ్రాంతినిస్తూ అతని స్థానంలో శాంసన్కు అవకాశం కల్పించింది. ఓపెనర్గా రాహుల్తో కలిసి మైదానంలోకి వచ్చిన శాంసన్..కుగ్లీన్ వేసిన రెండో ఓవర్ తొలి బంతిని సిక్స్ కొట్టి ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. అదే దూకుడుతో మూడో బంతిని నిర్లక్ష్యంగా భారీ షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. అయితే అతను ఔటైన తీరే ఇప్పుడు అందరికి ఆగ్రహం తెప్పిస్తుంది.
రాకరాక వచ్చిన అవకాశంతో నిరూపించుకోవాల్సింది పోయి.. ఆదిలోనే అంత అత్యుత్సాహం ఎందుకని శాంసన్పై విమర్శకులు మండిపడుతున్నారు. అసలు పిచ్ పరిస్థితిని అర్థం చేసుకోకుండా అలా ఆడటం అతని దుందుడుకు స్వభావానికి అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు. ఐదేళ్ల తర్వాత శాంసన్కు వచ్చిన రెండో అవకాశం కూడా పోయిందని అతని అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా ఆడే పంత్ వైరస్ ఏమైనా శాంసన్కు అంటిందా ఏందని సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.