
కాన్పూర్: రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కించుకున్న అశ్విన్ ఐదు వికెట్లు తీస్తే టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు సాధించిన మూడో బౌలర్గా ఘనతను అందుకుంటాడు. ఈ క్రమంలో వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రికార్డును అధిగమిస్తాడు. ప్రస్తుతం హర్భజన్ సింగ్(417) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
పది వికెట్లు తీస్తే.. భారత్ తరఫున అత్యధిక సార్లు ఈ ఘనతను అందుకున్న అనిల్ కుంబ్లే (8)తో సమానంగా నిలుస్తాడు. ప్రస్తుతం అశ్విన్ ఏడు సార్లు టెస్టుల్లో పది వికెట్లు తీశాడు. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 22 సార్లు ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. కాగా, టీమిండియా ఇప్పటికే టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేయగా ఇప్పుడు టెస్టు సిరీస్ను కూడా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఆడుతోంది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ విశ్రాంతి తీసుకోగా యువ ఆటగాళ్లు అవకాశాలు దక్కించుకున్నారు.
శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్తో అరంగేట్రం చేస్తున్నాడు. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆదిలోనే ఓ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(13) తీవ్రంగా నిరాశపరిచాడు. కైల్ జెమీసన్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో 21 పరుగులకే భారత్ వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం 26 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి భారత్ 79 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్(49 బ్యాటింగ్), చతేశ్వర్ పుజారా(15 బ్యాటింగ్) ఉన్నారు.