
రాంచీ: మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన రెండో టీ20 ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి గట్టి షాక్ తగిలింది. ఈ మ్యాచ్ను వాయిదా వేయాలంటూ జార్ఖండ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాంచీ వేదికగా శుక్రవారం(నవంబర్ 19)న రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉంది. ఈ మ్యాచ్కు 100 శాతం ప్రేక్షకులను అనుమతిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ధీరజ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ భయంతో ఇంకా పాఠశాలలు మూసే ఉన్నాయని.. వైరస్ భయం వల్ల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారని ధీరజ్ తన పిటిషన్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో తమ దగ్గర జరిగే క్రికెట్ మ్యాచ్కు 100 శాతం మంది వీక్షకులను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. మ్యాచ్ను వాయిదా వేయడం లేదా 50 శాతం మంది వీక్షకులనే అనుమతిస్తూ నిర్ణయం తీసుకునేలా నిర్వాహకులను ఆదేశించాలని ధీరజ్ కుమార్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం 50 శాతం ప్రేక్షకులనే అనుమతిచ్చిందని పేర్కొన్నారు.
టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. జైపూర్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో భారత్ ఐదు వికెట్లతో గెలుపొంది మూడు టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (42 బంతుల్లో 70; 3 ఫోర్లు, 4 సిక్స్లు), మార్క్ చాప్మన్ (50 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా... కెప్టెన్ రోహిత్ శర్మ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు.
ఈ విజయంతో కెప్టెన్గా రోహిత్ శర్మ, కోచ్గా రాహుల్ ద్రవిడ్లకు మంచి శుభారంభం దక్కింది. ఇక ఇదే ఉత్సాహంలో రోహిత్ సేన రాంచీ వేదికగా శుక్రవారం జరిగే రెండో టీ20 కోసం సిద్దమవుతోంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది. తద్వారా చివరి టీ20కి రిజర్వ్ బెంచ్ సత్తాను పరీక్షించాలని భావిస్తోంది. మరోవైపు ఫస్ట్ టీ20లో ఆఖరి ఓవర్ వరకు పోరాడిన న్యూజిలాండ్.. రెండో టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్ రేసులో నిలవాలనుకుంటుంది. దాంతో ఈ మ్యాచ్పై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.