ముంబై: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటములకు భారత జట్టు మూడింతల ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్ను కైవసం చేసుకున్న భారత్.. తాజాగా రెండు టెస్ట్ల సిరీస్ను కూడా1-0తో గెలుచుకుంది. ముంబై వేదికగా జరిగిన రెండో టెస్ట్లో సమష్టిగా రాణించిన కోహ్లీసేన 372 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది.
540 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్లో 167 పరుగులకే కుప్పకూలింది. డారిల్ మిచెల్(92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 60), హెన్రీ నికోల్స్(111 బంతుల్లో 8 ఫోర్లు 44), విల్ యంగ్ (41 బంతుల్లో 4 ఫోర్లతో 20), రచిన్ రవీంద్ర(50 బంతుల్లో 4 ఫోర్లతో 18) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితయ్యారు. భారత బౌలరల్లో రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.
భారత్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులు చేయగా.. కివీస్ కేవలం 62 పరుగులకే ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 276/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించిన మయాంక్ అగర్వాల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. రవిచంద్రన్ అశ్విన్కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వరించింది.
అంతకుముందు 140/5 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్.. జయంత్ యాదవ్ చెలరేగడంతో 11.3 ఓవర్లలోనే తమ పోరాటాన్ని ముగించింది. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన రచిన్ రవీంద్రను జయంత్ యాదవ్ ఔట్ చేశాడు. ఊరించే బంతితో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చిన జయంత్... ఆ తర్వాత ఓకే ఓవర్లో టీమ్ సౌథీ(0), కైల్ జెమీసన్(0)లను పెవిలియన్ చేర్చాడు. ఇక సోమర్ విల్లే(1)ను జయంత్ ఔట్ చేయగా.. హెన్రీ నికోల్స్(44)ను అశ్విన్ స్టంపౌట్గా బోల్తా కొట్టించాడు. దాంతో భారత్ విజయం లాంఛనమైంది.