ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా చెత్త రికార్డ్ నమోదు చేసింది. అత్యధిక క్యాచ్లు నేలపాలు చేసిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఈ టోర్నీలో టీమిండియా మొత్తం 9 క్యాచ్లు నేలపాలు చేసింది. ఇందులో 5 క్యాచ్లు ఫైనల్లోనే జారవిడచడం గమనార్హం. కీలకమైన ఫైనల్లో టీమిండియా ఫీల్డింగ్లో దారుణంగా విఫలమైంది. ముఖ్యమైన క్యాచ్లతో పాటు పలు రనౌట్ అవకాశాలను చేజార్చుకుంది.
న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర ఇచ్చిన రెండు క్యాచ్లను టీమిండియా అందుకోలేకపోయింది. అతను ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను మహమ్మద్ షమీ వదిలేయగా...మరో క్యాచ్ను శ్రేయస్ అయ్యర్ అందుకోలేకపోయాడు. జడేజా బౌలింగ్లో డేంజరస్ గ్లేన్ ఫిలిప్స్ ఇచ్చిన క్యాచ్ను శుభ్మన్ గిల్ వదిలేసాడు. డారిల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్లను రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్ అందుకోలేకపోయారు. మైకేల్ బ్రేస్వెల్ను రనౌట్ చేసే అవకాశాన్ని కుల్దీప్ చేజార్చాడు. టీమిండియా ఫీల్డింగ్ను చూసి అనుష్క శర్మతో పాటు ఫ్యాన్స్ షాకయ్యారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉంటే న్యూజిలాండ్ మరింత తక్కువ స్కోర్కే పరిమితమయ్యేది.

ఫైనల్ మ్యాచ్కు ముందు అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శన చేసిన టీమిండియా.. కీలక మ్యాచ్లో మాత్రం తేలిపోయింది. దాంతో ఈ టోర్నీలోనే అత్యధిక క్యాచ్లు వదిలేసిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఈ టోర్నీలో టీమిండియా క్యాచ్లు వదిలేసిన సామర్థ్యం 70 శాతంగా ఉండగా.. బంగ్లాదేశ్(66.6), పాకిస్థాన్(60) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. మైకేల్ బ్రేస్వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్), డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. రచిన్ రవీంద్ర(29 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 37), గ్లేన్ ఫిలిప్స్(52 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 34)కీలక ఇన్నింగ్స్ ఆడారు. టీమిండియా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తీ(2/45), కుల్దీప్ యాదవ్(2/40) సత్తా చాటినా.. పేసర్లు మహమ్మద్ షమీ(1/74), హార్దిక్ పాండ్యా(0/30) దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ధారళంగా పరుగులిచ్చారు.