
హైదరాబాద్: భారత్-న్యూజిలాండ్ మధ్య బుధవారం ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసామని రాచకొండ కమిషనర్ చౌహాన్ తెలిపారు. 2500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నామన్నారు. ఈ మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మ్యాచ్కు హాజరయ్యేవారు నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తామని తెలిపారు. మ్యాచ్కు వచ్చే అభిమానులు మొబైల్ మినహా మరే ఇతర వస్తువులను తీసుకురావద్దని, మైదానంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
పాసులు, బీసీసీఐ కార్డులు ఉన్నవారు మాత్రమే స్టేడియానికి రావాలని కోరారు. మైదానంలోకి వెళ్లి క్రికెటర్లను అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేశామని, మహిళల కోసం 40 మందితో షీ టీమ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. మ్యాచ్ టికెట్లను బ్లాక్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్, బ్లాక్ టికెట్లపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పిన కమిషనర్.. బ్లాక్ టికెట్ల విక్రయాలపై ఇప్పటికే 3 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.
బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకొని ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి టీమిండియా జోరు మీదుండగా.. పాకిస్థాన్ గడ్డపై 2-1తో సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే శ్రేయస్ అయ్యర్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అయ్యర్ దూరమవడంతో సూర్యకుమార్ యాదవ్కు లైన్ క్లియర్ అయ్యింది.