
సంజూ విఫలం..
ఇక టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆతిథ్య బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. యువ బ్యాట్స్మన్ సంజూ శాంసన్(2) తీవ్రంగా నిరాశపరిచాడు. 5 బంతుల్లో రెండు పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యాడు. రెండో ఓవర్లో కుగ్లిన్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ మీదుగా వేసిన బంతిని.. అంచనా వేయలేకపోయిన కేరళ బ్యాట్స్మన్ షార్ట్ కవర్స్ మీదుగా భారీ షాట్కు ప్రయత్నంచి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దీంతో తనకు దక్కిన సువర్ణావకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. సంజూ శాంసన్ కోసం ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసి మరీ వనడౌన్లో వచ్చిన రోహిత్ అద్భుతంగా రాణించాడు. సంజూ శాంసన్(2) ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన హిట్మ్యాన్ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. మొదట్లో రోహిత్ కాస్త నెమ్మదిగా ఆడగా.. రాహుల్ చెలరేగాడు.

రాహుల్ దూకుడు..
సౌథి వేసిన మూడో ఓవర్లో రాహుల్ 6, 4, 4తో విరుచుకుపడగా.. బెనెట్ వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి రోహిత్ బౌండరీల ఖాతా తెరిచాడు. ఆరో ఓవర్ తొలి బంతికి రాహుల్ భారీ సిక్సర్ కొట్టడంతో పవర్ ప్లే ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. అనంతరం రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడిన భారత్ ద్వయం.. తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగింది. సోధి వేసిన 9వ ఓవర్ నాలుగో బంతిని బౌండరీకి తరలించిన రోహిత్.. 10వ ఓవర్లో సిక్సర్, ఫోర్, 11వ ఓవర్లో మరో సిక్సర్తో వేగం పెంచాడు. ఇక బెనెట్ వేసిన 12 ఓవర్ మూడో బంతికి రాహుల్(45) క్యాచ్ ఔట్గా వెనుదిరిగి హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.
తర్వాత క్రీజులోకి వచ్చిన అయ్యర్ ఎదుర్కొన్న రెండో బంతినే బౌండరీకి తరలించాడు. అనంతరం ప్రత్యర్థి బౌలర్లు పరుగులను కట్టడి చేయగా.. రోహిత్-అయ్యర్ రన్ రేట్ తగ్గకుండా సింగిల్స్ తీస్తూ జాగ్రత్త పడ్డారు.
సాంట్నర్ వేసిన 15 ఓవర్ చివరి బంతికి అయ్యర్ భారీ సిక్సర్ కొట్టగా.. ఆ మరుసటి ఓవర్ తొలి బంతిని రోహిత్ ఫోర్ కొట్టి 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే అయ్యర్ మరో భారీ సిక్సర్ కొట్టాడు.

రోహిత్ రిటైర్డ్ హర్ట్..
ఇక 16 ఓవర్ రెండో బంతికి భారీ సిక్సర్ కొట్టిన రోహిత్ శర్మ.. ఆ వెంటనే రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయి విఫలమయ్యాడు. పరుగు తీయలేక ఇబ్బంది పడ్డ అతను రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్ చేరాడు. అయితే అంతకు ముందే రోహిత్ చీలిమండ గాయంతో ఇబ్బంది పడ్డట్లు కనిపించింది. ఫిజియో సైతం మైదానంలోకి వచ్చి ట్రీట్ మెంట్ చేశాడు. చీలిమండ పట్టేయడంతోనే బ్యాటింగ్ చేయలేక రోహిత్ వెనుదిరిగినట్లు తెలుస్తోంది.
రోహిత్ స్థానంలో వచ్చిన శివమ్ దూబే(5) సంజూ తరహాలోనే తీవ్రంగా నిరాశ పరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పాండే సిక్స్, ఫోర్ కొట్టడంతో భారత్కు ఆఖరి ఓవర్లో 15 పరుగులు వచ్చాయి.


Click it and Unblock the Notifications
