
మౌంట్ మాంగనుయ్: ఈ ఏడాది ఫుల్ స్వింగ్లో ఉన్న టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి టీ20లో తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్న రాహుల్(45).. ఒక ద్వైపాక్షిక అంతర్జాతీయ టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన తొలి క్రికెటర్గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్ కొలిన్ మున్రో పేరిట ఉండగా రాహుల్ అధిగమించాడు.
2017-18 వెస్టిండీస్తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో కొలిన్ మున్రో 223 పరుగులు చేసి ఈ ఘనతనుందుకోగా.. తాజాగా రాహుల్ 224 పరుగులతో అధిగమించాడు. ఇక రాహుల్ ఈ సిరీస్లో 45, 39, 27, 57, 56తో రాణించాడు. ఇక భారత్ తరుఫున విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును కూడా రాహుల్ అధిగమించాడు.
2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్లో కోహ్లి 199 పరుగులు చేసి ఈ రికార్డు నెలకొల్పగా.. తాజాగా రాహుల్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో భారత్ తరఫున తొలి నాలుగు స్థానాల్లో రాహుల్, కోహ్లిలే ఉండటం విశేషం.
2019లో వెస్టిండీస్తో జరిగిన మూడు టీ20ల సిరీస్లో కోహ్లీ 183 పరుగులు చేయగా.. అదే సిరీస్లో రాహుల్ 164 రన్స్ చేశాడు. ఇక 2017లో శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్లో రోహిత్ శర్మ 162 పరుగులు చేసి వీరి తర్వాతి స్థానంలో ఉన్నాడు.
ఇక ఈ మ్యాచ్లో తాత్కలిక కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తూ గాయపడగా.. కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా స్పష్టం చేసింది.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. తాత్కలిక కెప్టెన్ రోహిత్ శర్మ(41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు 60 రిటైర్డ్ హర్ట్) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్(33 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 45) తన ఫామ్ను కొనసాగించాడు.
చివర్లో శ్రేయస్ అయ్యర్(31 బంతుల్లో1 ఫోర్, 2సిక్స్లతో 33 ), మనీష్ పాండే(4 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్తో 11) మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో కుగ్లిన్ రెండు వికెట్లు తీయగా.. బెన్నెట్ ఒక వికెట్ తీశాడు. ఆఖరి ఓవర్లలో పరుగులు రాకుండా ఆతిథ్య బౌలర్లు కట్టడి చేయడంతో భారత్ సాధారణ స్కోర్కే పరిమితమైంది.