
మౌంట్ మాంగనుయ్: న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్.. ఒకే ఒక్క మార్పుతో గత మ్యాచ్ జట్టుతోనే బరిలోకి దిగుతుంది. విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు.
ఇక యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు ఈ మ్యాచ్లోనూ అవకాశం దక్కలేదు. గత మ్యాచ్లో దారుణంగా విఫలమైన సంజూశాంసన్కు టీమ్మేనేజ్మెంట్ మరో అవకాశం ఇచ్చింది. రాహుల్, శాంసన్ ఓపెనర్లుగా రానుండగా.. రోహిత్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.
ఇక న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రస్తుత మ్యాచ్కు సైతం దూరమయ్యాడు. భుజం గాయం కారణంగా గత మ్యాచ్ ఆడని విలియమ్సన్.. నేటి మ్యాచ్లో కూడా అందుబాటులోకి రాలేదు. దాంతో కివీస్ కెప్టెన్సీ బాధ్యతలను మరోసారి టిమ్ సౌథి తీసుకున్నాడు. ఇక ఆతిథ్య జట్టు ఎలాంటి మార్పులు లేకుండా గత మ్యాచ్ జట్టుతోనే బరిలోకి దిగుతుంది. విలియమ్సన్ గాయం నుంచి కోలుకోకపోవడంతో తుది జట్టులోకి రాలేకపోయాడని తాత్కలిక కెప్టెన్ టీమ్ సౌథి తెలిపాడు.
ఒకవైపు సొంతగడ్డపై న్యూజిలాండ్ను క్లీన్ స్వీప్ చేసి కొత్త రికార్డు సృష్టించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుంటే, మరొకవైపు చెత్త రికార్డును తప్పించుకోవడంపై ఆతిథ్య జట్టు కసరత్తులు చేస్తోంది. బ్యాటింగ్ పిచ్ కావడంతో రోహిత్ టాస్ గెలవగానే ఏ మాత్ర ఆలోచించకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. యువ బ్యాట్స్మెన్ సంజూ శాంసన్, రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని, తాను మూడో స్థానంలో బ్యాటింగ్క్ వస్తానని టాస్ సందర్భంగా రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఇక న్యూజిలాండ్ బ్యాట్స్మన్ రాస్ టేలర్కు ఇది 100వ అంతర్జాతీయ టీ20 కాగా.. మ్యాచ్కు ముందు మార్టిన్ గప్టిల్ క్యాప్ అందజేశాడు.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, సంజూశాంసన్, అయ్యర్, పాండే, దూబే, వాషింగ్టన్ సుందర్, శార్దుల్, చహల్, బుమ్రా, సైనీ.
న్యూజిలాండ్: టీమ్ సౌథి(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, మన్రో, టామ్ బ్రూస్రాస్, టేలర్, టిమ్ సౌతీ, డరైన్ మిషెల్, సీఫెర్ట్, సాన్ట్నర్, కుగ్లీన్, బెన్నెట్.