కివీస్ టపటపా..17కే మూడు..
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. బుమ్రా తన తొలి ఓవర్లోనే గప్టిల్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి భారత్కు శుభారంభాన్నిచ్చాడు. ఆ మరుసటి ఓవర్లో మున్రోను సుంధర్ బౌల్డ్ చేసి దెబ్బ కొట్టాడు. ఆ వెంటనే సైనీ వేసిన ఓవర్లో తొలి బంతికే టామ్ బ్రూస్.. కీపర్ రాహుల్ చాక చక్యంతో రనౌటయ్యాడు. దీంతో ఆ జట్టు 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆదుకున్న సీఫెర్ట్.. టేలర్
క్లిష్ట స్థితిలో ఉన్న జట్టును సీఫెర్ట్.. రాస్ టేలర్ ఆదుకున్నారు. సీఫెర్ట్ వచ్చిరావడంతోనే ఎదురు దాడికి దిగగా.. టేలర్ కొంచెం నెమ్మదిగా ఆడాడు. ప్రతీ ఓవర్కు బౌండరీ సాధిస్తూ ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేసింది. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి న్యూజిలాండ్ 41/3 స్కోర్ చేసింది. అనంతరం చహల్ వీరి దాడిని అడ్డుకున్నాడు. పరుగులు చేయకుండా కట్టడి చేశాడు.
దూబే బౌలింగ్లో విధ్వంసం..
శివమ్ దూబే వేసిన 10వ ఓవర్లో సీఫెర్ట్, రాస్ టేలర్ విధ్వంసం సృష్టించారు. తొలి రెండు బంతులను భారీ సిక్స్లుగా మలిచిన సీఫెర్ట్ అనంతరం సింగిల్ తీశాడు. ఇక శివమ్ దూబే నోబాల్ వేయగా టేలర్ బౌండరీ కొట్టాడు. దీంతో ఐదు పరుగులు వచ్చాయి. ఆ మరుసటి బంతులను కూడా టేలర్ రెండు భారీ సిక్స్లు కొట్టడంతో న్యూజిలాండ్కు మొత్తం ఈ ఓవర్లోనే 34 పరుగులు వచ్చాయి. దీంతో టీ20ల్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న రెండో బౌలర్గా శివమ్ దూబే చెత్తరికార్డును మూటగట్టుకున్నాడు.
ఈ క్రమంలో బుమ్రా బౌలింగ్లో ఓ ఫోర్ కొట్టిన సీఫెర్ట్.. సైనీ వేసిన 13 ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసి 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ మరుసటి బంతికే భారీ షాట్కు ప్రయత్నించి సామ్సన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
బూమ్ బూమ్ .. బుమ్రా..
సీఫెర్ట్ వికెట్ అనంతరం క్రీజలోకి వచ్చిన మిచెల్ను బుమ్రా అద్భుత యార్కర్తో బౌల్డ్ చేశాడు. తర్వాత చహల్, సుంధర్ పరుగులివ్వకుండా కట్టడి చేయగా.. టేలర్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇక 17 ఓవర్లో ఠాకుర్ మ్యాచ్ను మలుపు తిప్పాడు. తొలుత సాంట్నర్ను క్యాచ్ ఔట్గా.. ఆ వెంటనే కుగ్లిన్ను అదే తరహాలో ఔట్ చేశాడు. 18వ ఓవర్లో సైనీ టేలర్ను క్యాచ్ ఔటగా పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. ఇక న్యూజిలాండ్ విజయానికి 12 బంతుల్లో 24 పరుగులు కావాల్సిన సమయంలో బుమ్రా.. సౌథీ ఔట్ చేసి కేవలం మూడు పరుగులు ఇచ్చాడు.
లాస్ట్ ఓవర్లో టెన్షన్ పెట్టిన సిక్సర్లు..
ఇక చివరి ఓవర్లో 6 బంతుల్లో 21 పరుగులు అవసరం కాగా.. సోధి రెండు భారీ సిక్సర్లు కొట్టి కలవరపెట్టాడు. కానీ ఠాకుర్ ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా మిగతా బంతులను డాట్ చేయడంతో భారత్కు విజయం దక్కింది.