ముంబై: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. విశ్రాంతి అనంతం విరాట్ ఈ మ్యాచ్తోనే రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక విరాట్ కోహ్లీ రాకతో వైస్ కెప్టెన్ అజింక్యా రహానేపై వేటు పడింది. గత కొంత కాలంగా నిలకడలేమి ఆటతో సతమతమవుతున్న రహానేకు టీమ్మేనేజ్మెంట్ ఉద్వాసన పలికింది. ఇక ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాలు గాయాలతో ఈ మ్యాచ్కు దూరం కాగా.. మహమ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్ జట్టులోకి వచ్చారు.
ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసేందుకు ప్రయత్నిస్తామని విరాట్ కోహ్లీ తెలిపాడు. పిచ్పై పెద్దగా గడ్డి లేదని, సూర్యుడు కూడా వచ్చాడు కాబట్టి బ్యాటింగ్కు అనుకూలిస్తుందని చెప్పాడు. కాన్పూర్లో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్నామన్నాడు. అయితే ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ అద్బుతంగా ఆడిందన్నాడు. ఇక మోచేతి గాయంతో కేన్ విలియమ్సన్ దూరం కాగా.. డారిల్ మిచెల్ జట్టులోకి వచ్చాడు. ఇక తాము కూడా బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని టామ్ లాథమ్ చెప్పుకొచ్చాడు. కాకపోతే పిచ్పై గత కొన్ని రోజులుగా కవర్స్ కప్పి ఉంచారు కాబట్టి తమకు అనుకూలించే అవకాశం ఉందన్నాడు.
అన్ని అనుకూలతలు ఉన్నా న్యూజిలాండ్తో తొలి టెస్టులో చేతులదాకా వచ్చిన విజయాన్ని చేజిక్కించుకోలేకపోయిన భారత్ ఈసారి అలాంటి తప్పును పునరావృతం చేయరాదని పట్టుదలగా ఉంది. రెండో టెస్టులో గెలుపుతో పాటు సిరీస్ను కూడా సొంతం చేసుకునేందుకు టీమిండియా సన్నద్ధమైంది. గత మ్యాచ్కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లి ఈ టెస్టులో అందుబాటులోకి రావడం భారత జట్టు బలాన్ని పెంచింది. మరోవైపు పర్యాటక న్యూజిలాండ్ జట్టు కూడా తీసికట్టుగా ఏమీలేదు. ఒక్క వికెట్ చేతిలో పెట్టుకొని 11 మంది ఆటగాళ్లతో ఓ ఆటాడుకున్న కివీస్ అంతే ఆత్మవిశ్వాసంలో సమరానికి సన్నద్ధమైంది. న్యూజిలాండ్ తమ పర్యటనలో ఐదు మ్యాచ్లకు ఐదింటిలో టాస్ ఓడిపోయింది.
తుది జట్లు
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), శుబ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, శ్రేయస్ అయ్యర్, వృద్దిమాన్ సాహా, జయంత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్.
న్యూజిలాండ్: విల్ యంగ్, లాథమ్(కెప్టెన్), రాస్ టేలర్, నికోల్స్, బ్లన్డేల్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, కైల్ జేమీసన్, టిమ్ సౌతీ, సోమర్విలే, ఎజాజ్ పటేల్.