
ఇక కివీస్ పర్యటనలో కోహ్లీ ఒక అర్థ శతకం మినహా మిగతా అన్ని మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. హామిల్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 51 పరుగులు చేసిన భారత సారథి తర్వాత ఏ మ్యాచ్లోనూ కనీసం 20 పరుగులు మార్క్ను చేయలేకపోయాడు. ఈ టెస్టు సిరీస్లో మొత్తం 38 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. ఓవరాల్గా ఈ టోర్నీలో 11 ఇన్నింగ్స్ల్లో ఆడిన ఈ రన్మిషన్ మొత్తం 218 పరుగులే చేశాడు. ప్రస్తుతం భారత్ 28 ఓవర్లకు 70/3తో కొనసాగుతూ 77 పరుగుల ఆధిక్యంలో ఉంది. పుజారా(17 బ్యాటింగ్), రహానే(8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
అంతకు ముందు తొలి ఇన్నింగ్స్ ఓవర్నైట్ స్కోర్ 63/0తో రెండో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్.. మహ్మద్ షమీ (4/81), జస్ప్రీత్ బుమ్రా (3/62) ధాటికి 73.1 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా కోహ్లీసేనకు తొలి ఇన్నింగ్స్లో 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. న్యూజిలాండ్ జట్టులో టామ్ లాథమ్(52), జేమీసన్ (49), బ్లండెల్(30) టాప్ స్కోరర్లుగా నిలవగా.. విలియమ్సన్(3), రాస్ టేలర్(15), నికోలస్ (14) దారుణంగా విఫలమయ్యారు.
5 వికెట్లతో కోహ్లీసేన బ్యాటింగ్ పతనాన్ని శాసించిన యువ ప్లేయర్ కైలీ జేమీసన్.. బ్యాటింగ్లోను మరోసారి రాణించి భారత్ ఆధిక్యాన్ని అడ్డుకున్నాడు. వాగ్నర్(21)తో తొమ్మిదో వికెట్కు 48 పరుగులు జోడించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(3), పృథ్వీషా(14) వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీతో పుజారా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. దీంతో 48/2తో భారత్ టీ విరామానికి వెళ్లింది. బ్రేక్ అనంతరం కోహ్లీని ఔట్ చేసి గ్రాండ్ హోమ్ దెబ్బకొట్టాడు.