మళ్లీ విఫలమైన కోహ్లీ.. కష్టాల్లో భారత్

క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 114 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(3), మయాంక్ అగర్వాల్(7), అజింక్యా రహానే(7) మరోసారి నిరాశపరచగా.. యువ ఓపెనర్ పృథ్వీషా(64 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్తో 54)హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. దీంతో భారత్ 38 ఓవర్లలో 141/4 స్కోరు చేసింది. క్రీజులో పుజారా (46 బ్యాటింగ్), విహారీ(9 బ్యాటింగ్) ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. కైలీ జేమీసన్, ట్రెంట్ బౌల్ట్ చెరొక వికెట్ తీశారు.

జట్టులోకి జడేజా, ఉమేశ్..
ఇక తొలి టెస్ట్లో బ్యాటింగ్లో విఫలమైన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై వేటు వేసిన మేనేజ్మెంట్ తుది జట్టులోకి రవీంద్ర జడేజాను తీసుకుంది. గాయపడ్డ ఇషాంత్ శర్మ స్థానంలో ఉమేశ్ యాదవ్కు అవకాశం ఇచ్చింది. దీంతో యువ పేసర్ సైనీ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది.

మరోసారి టాస్ ఓడిన భారత్
పచ్చిక పిచ్లపై టాస్ కీలకం. కానీ భారత్ వరుసగా రెండో సారి టాస్ ఓడింది. టాస్ నెగ్గిన విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం దక్కలేదు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఆతిథ్య బౌలర్లు బ్యాట్స్మన్ను ముప్పు తిప్పలు పెట్టి ఫలితాన్ని రాబట్టారు. పేస్, బౌన్స్, షార్ట్ పిచ్ బంతులతో బెంబేలెత్తించారు.

పృథ్వీషా హాఫ్ సెంచరీ..
ఆదిలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ( 11 బంతుల్లో ఫోర్ 7)ను బౌల్ట్ వికెట్ల ముందు బోల్తా కొట్టించడంతో భారత్ 30 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వన్డౌన్లో వచ్చిన పుజారాతో కలిసి పృథ్వీ షా (54) ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఫోర్లు, సిక్సర్లతో వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. 47 పరుగులు వద్ద ఉన్నప్పుడు వాగ్నెర్ బౌలింగ్లో ఫైన్లెగ్ మీదుగా సిక్సర్ బాది 60 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. కానీ అదే జోరులో జేమీసన్ బౌలింగ్లో షాట్కు యత్నించి స్లిప్లో ఉన్న లాథమ్ చేతికి చిక్కాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన కోహ్లీ (3)తో కలిసి పుజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటంతో భారత్ 85/2తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.

కొనసాగుతున్న కోహ్లీ వైఫల్యం
లంచ్ విరామం అనంతరం టీమ్ సౌథీ బౌలింగ్లో విరాట్ కోహ్లీ (3) వికెట్ల ముందు దొరికిపోయాడు. కోహ్లీ రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. కోహ్లీ మరోసారి విఫలమవ్వడం టీమిండియాను కలవరపెడుతోంది. గత ఐదు ఇన్నింగ్స్ల్లో విరాట్ 3, 19, 2, 9, 15 పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యాడు. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన రహానే(7) కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. సౌథీ బౌలింగ్లో టేలర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications