క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్లో చెత్త బ్యాటింగ్తో విఫలమైనా.. బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్ధిని 235 పరుగులకే కట్టడి చేసి పోరాడే శక్తినిచ్చారు. కానీ వారందించిన సహకారాన్ని అందిపుచ్చుకోలేకపోయిన బ్యాట్స్మెన్ మరోసారి పేలవ బ్యాటింగ్తో దారుణంగా విఫలమయ్యారు.
7 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. ట్రెంట్ బోల్ట్ (3/12) ధాటికి కుదేలైంది. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 36 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో పంత్(1 బ్యాటింగ్), విహారి(5 బ్యాటింగ్) ఉన్నారు. ప్రత్యర్థి బౌలర్లలో బౌల్ట్ మూడు వికెట్లకు తోడుగా.. గ్రాండ్హోమ్, వాగ్నర్,సౌతీలు తలో వికెట్ పడగొట్టారు.
ప్రస్తుతం భారత్ 97 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆటలో పంత్, విహారీ, లేక బౌలర్లు అద్భుతం చేస్తే తప్పా భారత్ ఓటమి నుంచి తప్పించుకోలేదు.
జడేజా కళ్లు చెదిరే క్యాచ్.. సూపరో సూపర్..!(వీడియో)
భారత బ్యాటింగ్లో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(3), పృథ్వీషా(14)తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ(14), పుజారా(24), రహానే (9), ఉమేశ్ యాదవ్(1) దారుణంగా విఫలమయ్యారు. ఇక తొలి ఇన్నింగ్స్లో భారత్ 242 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.
ఇక అంతకు ముందు తొలి ఇన్నింగ్స్ ఓవర్నైట్ స్కోర్ 63/0తో రెండో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్.. మహ్మద్ షమీ (4/81), జస్ప్రీత్ బుమ్రా (3/62) ధాటికి 73.1 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా కోహ్లీసేనకు తొలి ఇన్నింగ్స్లో 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. న్యూజిలాండ్ జట్టులో టామ్ లాథమ్(52), జేమీసన్ (49), బ్లండెల్(30) టాప్ స్కోరర్లుగా నిలవగా.. విలియమ్సన్(3), రాస్ టేలర్(15), నికోలస్ (14) దారుణంగా విఫలమయ్యారు.