రెండో టెస్ట్లో భారత్ చిత్తు.. 0-2తో సిరీస్ సమర్పయామి!!

క్రైస్ట్చర్చ్: టెస్ట్ చాంపియన్షిప్లో వరుస విజయాలతో దూకుడు కనబర్చిన టీమిండియా.. న్యూజిలాండ్ గడ్డపై మాత్రం తేలిపోయింది. సంప్రదాయక ఫార్మాట్లో నెంబర్ వన్ జట్టుగా కొనసాగుతున్న భారత జట్టు.. కివీస్ చేతిలో మాత్రం ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. సోమవారం ముగిసిన రెండో టెస్ట్లో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన భారత్.. 0-2తో న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్కు గురైంది. ఫలితంగా టెస్ట్ చాంపియన్షిప్లో తొలిసారి కోహ్లీసేన భంగపాటుకు గురైంది.
సుమారు నెల రోజుల ఈ సుదీర్ఘ పర్యటనను ఘోర ఓటమితో ముగించింది. అంతేకాకుండా గత 8 ఏళ్లలో ఓ టెస్ట్ సిరీస్లో భారత్ వైట్ వాష్కు గురవ్వడం ఇదే తొలి సారి.
రెండో ఇన్నింగ్స్లో భారత్ నిర్ధేశించిన 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ 36 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి ఛేదించింది. లాథమ్(52), బ్లండెల్(55) అర్ధసెంచరీలతో రాణించారు. విలియమ్సన్ 5 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. భారత్ బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.
అంతకు ముందు 90/6 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 124 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి(9), రిషభ్ పంత్(4), మహ్మద్ షమీ(5), బుమ్రా(4) స్వల్ప స్కోర్లకు వెనుదిరగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. రవీంద్ర జడేజా(16) అజేయంగా నిలవగా.. పుజారా(24) టాప్ స్కోరర్గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. సౌథీ మూడు, వాగ్నర్, గ్రాండ్ హోమ్ తలో వికెట్ తీశారు. ఇక తొలి ఇన్నింగ్స్లో భారత్ 242 పరుగులకు కుప్పకూలగా.. న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌటైంది.

కివీస్ ఓపెనర్లు ఓపికగా..
స్వింగ్ పేస్కు అనుకూలిస్తున్న పిచ్పై న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్(52), బండెల్(55)ఓపికగా ఆడారు. స్వల్ప లక్ష్యమే అయినా బ్యాటింగ్కు ఏమాత్రం అనువుగా లేని పిచ్పై తప్పులు చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గ్రహించిన ఈ జోడీ.. నిదానంగా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. మంచి బంతులను గౌరవిస్తూ అవకాశం వచ్చిన బంతులను బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో కొంత జోరు పెంచిన లాథమ్ 67 బంతుల్లో 10 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అదే జోరులో ఉమేశ్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేరాడు. దీంతో తొలి వికెట్కు నమోదైన 103 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి విలియమ్సన్ రాగా.. న్యూజిలాండ్ 108/1తో టీ బ్రేక్కు వెళ్లింది.

విలియమ్సన్ విఫలం..
విరామం అనంతరం బ్లండెల్ 108 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాయి. అయితే బుమ్రా తన వరుస ఓవర్లలో విలియమ్సన్(5), బండ్లెల్(55) ఔట్ చేసి పెవిలియన్ చేర్చాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తర్వాత టేలర్(5 నాటౌట్), నికోలస్ (5 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి విజయాన్నందించారు.

34 పరుగుల్లోనే..
90/6 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 34 పరుగులు మాత్రమే జోడించి కుప్పకూలింది. క్రీజులో ఉన్న పంత్, విహారీలు అద్భుతం చేయలేకపోయారు. టాపార్డ్ తరహాలోనే దారుణంగా విఫలమయ్యారు. లోయరార్డర్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. జడేజా కొంత ప్రయత్నం చేసినా.. అతనికి ఇతర ఆటగాళ్ల నుంచి సహకరం అందలేదు. దీంతో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications