
ముంబై: భారత్-న్యూజిలాండ్ మధ్య ప్రారంభంకావాల్సిన రెండో టెస్ట్ మరింత ఆలస్యం కానుంది. గత రెండు రోజులుగా కురిసిన వర్షంతో ముంబై మైదానం చిత్తడిగా మారింది. ప్రస్తుతం వర్షం లేకున్నా.. పిచ్, ఔట్ ఫీల్డ్ తడిగా ఉంది. దీంతో టాస్ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే అంపైర్లు పలుమార్లు పిచ్ను మైదానాన్ని పరిశీలించారు. 10.30 గంటలకు మరోసారి చెక్ చేయనున్నారు. అప్పుడే నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈ మ్యాచ్ బరిలోకి దిగే భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
వైస్ కెప్టెన్ అజింక్య రహానేతో పాటు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ ఈ మ్యాచ్కు దూరమైనట్లు సమాచారం. కెప్టెన్ విరాట్ కోహ్లీ రాకతో రహానేపై వేటు వేయగా.. ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా గాయాలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. కాన్పూర్ టెస్ట్ చివరి రోజు ఇషాంత్ శర్మ చిటికనవేలుకు గాయమైందని, డిస్ లోకెట్ అయినట్లు సమాచారం. ఇక జడేజా కుడిచేతికి గాయమైందని, వాపురావడంతో స్కానింగ్కు పంపించారని, విశ్రాంతి తీసుకోవడమే ఉత్తతమమని ఫిజియోలు సూచించడంతో అతను ఈ మ్యాచ్కు దూరమయ్యాడని తెలుస్తోంది.
మరోవైపు మోచేతి గాయం తిరగబెట్టడంతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం ఈ మ్యాచ్ ఆడటం లేదని తెలుస్తోంది. అన్ని అనుకూలతలు ఉన్నా న్యూజిలాండ్తో తొలి టెస్టులో చేతులదాకా వచ్చిన విజయాన్ని చేజిక్కించుకోలేకపోయిన భారత్ ఈసారి అలాంటి తప్పును పునరావృతం చేయరాదని పట్టుదలగా ఉంది. రెండో టెస్టులో గెలుపుతో పాటు సిరీస్ను కూడా సొంతం చేసుకునేందుకు టీమిండియా సన్నద్ధమైంది. గత మ్యాచ్కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లి ఈ టెస్టులో అందుబాటులోకి రావడం భారత జట్టు బలాన్ని పెంచింది. మరోవైపు పర్యాటక న్యూజిలాండ్ జట్టు కూడా తీసికట్టుగా ఏమీలేదు. ఒక్క వికెట్ చేతిలో పెట్టుకొని 11 మంది ఆటగాళ్లతో ఓ ఆటాడుకున్న కివీస్ అంతే ఆత్మవిశ్వాసంలో సమరానికి సన్నద్ధమైంది.