కాన్పూర్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్లు టీమ్ సౌథీ, కైల్ జెమీసన్, ఆజాజ్ పటేల్ చెలరేగడంతో భారత టాపార్డర్ బ్యాట్స్మన్ పెవిలియన్కు క్యూ కట్టారు. దాంతో భారత్ లంచ్ విరామానికి 32 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. క్రీజులో సెంచరీ హీరో శ్రేయస్ అయ్యర్(18 బ్యాటింగ్), రవిచంద్రన్ అశ్విన్(20 బ్యాటింగ్) ఉన్నారు.
ఇక 14/1 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఓవర్నైట్ బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారా(33 బంతుల్లో 22), మయాంక్ అగర్వాల్(17) నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా కైల్ జెమీసన్ దెబ్బకొట్టాడు. అనూహ్య షార్ట్ పిచ్ బాల్తో పుజారాను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. తొలుత అంపైర్ ఔటివ్వకపోయినప్పటికీ.. కివీస్ రివ్యూ తీసుకొని ఫలితం రాబట్టింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే(2)ను ఆజాజ్ పటేల్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత సౌథీ ఒకే ఓవర్లో మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేలాను ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీశాడు.
తొలుత మయాంక్ అగర్వాల్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చిన సౌథీ... జడేజా ఎల్బీగా వెనక్కిపంపాడు. జడేజా రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. దాంతో భారత్ 51 పరుగులకే 5 వికెట్ల కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అశ్విన్తో కలిసి శ్రేయస్ అయ్యర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. ప్రస్తుతం భారత్ 133 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే మరో 170 పరుగులు చేయాల్సిందే. కనీసం 130 రన్స్ అయినా చేయాలి. ఆ తర్వాత స్పిన్ ఉచ్చులో న్యూజిలాండ్ను బిగిస్తే విజయాన్నందుకోవచ్చు. ఇక తొలి ఇన్నింగ్స్లో భారత్.. 345 పరుగులకు ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్ 296 పరుగులకు కుప్పకూలింది.
భారత్ తొలి ఇన్నింగ్స్ 345 ఆలౌట్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 296 ఆలౌట్
భారత్ సెకండ్ ఇన్నింగ్స్ 84/5