

వెల్లింగ్టన్: రెండు టెస్ట్లో సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్కు వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో తొలి రోజు ఆట అర్థాంతరంగా నిలిచిపోయింది. వర్షం కారణంగా మూడో సెషన్ ఆట ఒక్క బంతి పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. రేపు యధావిదిగా రెండో రోజు ఆట ఉదయం 4 గంటలకు ప్రారంభం కానుంది. సరిగ్గా ఫైనల్ సెషన్ ఆరంభానికే ముందు వర్షం రావడంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. వర్షం వెలిసినా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దీంతో అంపైర్లు తొలి రోజు మిగిలిన ఆటను రద్దు చేశారు.
ఇక సెకండ్ సెషన్ ముగిసే సమయానికి టీమిండియా 55 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానే (38 బ్యాటింగ్), రిషభ్ పంత్(10 బ్యాటింగ్) ఉన్నారు. అంతకు ముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ తొలు బ్యాటింగ్ చేపట్టింది. ఈ మ్యాచ్తో అంతర్జాతీయ టెస్ట్ల్లోకి అరంగేట్రం చేసిన కైలీ జేమీసన్ తన ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు.
అరంగేట్ర మ్యాచ్లోనే అద్భుత బౌలింగ్తో చెలరేగాడు. జేమీసన్(3/38) ధాటికి భారత టాపార్డర్ చేతులెత్తేసింది. పిచ్ నుంచి లభించిన స్వింగ్ను అందిపుచ్చుకున్న ఆతిథ్య బౌలర్లు భారత్ పతనాన్ని శాసించారు.
ఓపెనర్లు పృథ్వీషా(16), మయాంక్ అగర్వాల్(34) మరోసారి దారుణంగా విఫలమయ్యారు. వీరి బాటలో చతేశ్వర్ పుజారా(11), కెప్టెన్ విరాట్ కోహ్లీ(2), విహారీ(7) విపలమై తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో భారత్ 101 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట స్థితిలో వైస్ కెప్టెన్ రహానే, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లో జెమీసన్ మూడు వికెట్లు తీయగా.. టీమ్ సౌతి, ట్రెంట్ బోల్ట్ చెరొక వికెట్ పడగొట్టారు.