
వెల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. కనీసం టాస్ కూడా పడలేదు. ఉదయం నుంచి వెల్లింగ్టన్ వర్షం పడటంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దాంతో టాస్కు ఆలస్యమైంది. ఆ తర్వాత వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకున్నారు. కనీసం 5 ఓవర్ల పాటైనా మ్యాచ్ నిర్వహించాలని భావించినా.. వర్షం అవకాశం ఇవ్వలేదు.
గత వారమే భారత్, న్యూజిలాండ్ జట్లు టీ20 ప్రపంచకప్లో ఫైనల్ కోసం ప్రత్యర్థి జట్లతో సెమీ ఫైనల్స్ ఆడాయి. ఓటమితో రెండు గ్రూప్ టాపర్స్ జట్ల ఆశలకు అక్కడే తెర పడింది. ఇప్పుడు ఓ రకంగా ఈ మూడు టీ20ల సిరీస్ను 'కాంస్య పత పోరుగా అభిమానులు భావించారు. కానీ వర్షం వారి ఆశలపై నీళ్లు చల్లింది.
ఈ మ్యాచ్ రద్దవ్వడం అమెజాన్ ప్రైమ్ ఆశలను గల్లంతు చేసింది. తొలిసారి ఈ పర్యటన ఓటీటీ రైట్స్ దక్కించుకున్న అమెజాన్.. గత రెండు వారాలుగా ఈ మ్యాచ్ను భారీ ప్రమోట్ చేసింది. హాట్ స్టార్కు అలవాటు పడిన అభిమానులు సైతం అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకొని ఈ మ్యాచ్ను వీక్షించేందుకు సిద్దమయ్యారు. తీరా ఈ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. రామేశ్వరం పోయినా.. శనేశ్వరం తప్పలేదని, న్యూజిలాండ్ పర్యటనలో కూడా వర్షాలు మ్యాచ్లను అడ్డుకుంటున్నాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక టీ20 ప్రపంచకప్లోనూ వర్షం కారణంగా నాలుగు మ్యాచ్లు రద్దయిన విషయం తెలిసిందే. భారత్, న్యూజిలా మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.