
జైపూర్: యూఏఈ గడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్తో విసిగిపోయిన అభిమానులను అలరించేందుకు భారత్, న్యూజిలాండ్ జట్లు సిద్దమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్ 2021లో చెత్తాటతో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టిన టీమిండియా.. సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో భాగంగా జైపూర్ వేదికగా బుధవారం ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్ అనంతరం టీ20 కెప్టెన్సీ బాధ్యతలనుంచి విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోవడంతో నయా సారథిగా రోహిత్ శర్మ, కోచ్గా రాహుల్ ద్రవిడ్లను బీసీసీఐ నియమించింది.
ఐపీఎల్లో సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ.. ఇండియా-ఏ, అండర్-19 కోచ్గా తనదైన ముద్ర వేసిన రాహుల్ ద్రవిడ్ కాంబినేషన్లో టీమిండియా 2022 టీ20 ప్రపంచకప్ టైటిలే లక్ష్యంగా సన్నాహకాలు ప్రారంభించనుంది. ఈ సుదీర్ఘ ప్రయాణానికి రేపటి మ్యాచ్తో తెరలేవనుంది. దాంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే నెమ్మదైన యూఏఈ పిచ్లపై బ్యాట్స్మన్ పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా మ్యాచ్ ఫలితాన్ని టాస్ శాసించడం ఫ్యాన్స్ను అసహనానికి గురి చేసింది. అయితే భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు టీ20ల సిరీస్లో పరుగుల వరద పారనుంది. జైపూర్లో బుధవారం తొలి టీ20 కోసం సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో పిచ్ సిద్ధమవుతోంది. భారీ స్కోర్లు ఖాయమని అంటున్నారు. గత ఎనిమిదేళ్లలో ఇక్కడ టీమ్ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక్కడ టీ20 మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఈ మైదానంలో బౌండరీలు పెద్దగా ఉన్నాయి. అయితే పిచ్ మందకొడిగా లేదని క్యురేటర్ తపష్ ఛటర్జీ చెప్పాడు. ''ఇక్కడ మ్యాచ్ ఎప్పుడు జరగనుందో మాకు తెలుసు. పిచ్ స్లోగా మారకుండా ఉండడం కోసం దాన్ని మరీ ఎక్కువగా వాడకుండా, మరీ తక్కువగా వాడకుండా జాగ్రత్తపడ్డాం. పిచ్లో జీవం ఉండాలన్నదే మా ఉద్దేశం. ఇటీవల కొన్ని టోర్నీల సందర్భంగా పిచ్ను పరీక్షించాం'' అని తెలిపాడు.
ఇక ఈ మ్యాచ్కు వర్ష సూచన లేకపోయినప్పటికీ.. కాలుష్యం సెగ తగలనుంది. ఢిల్లీ మాదిరిగా జైపూర్లో కూడా గాలి కాలుష్యం లెవల్స్ పెరిగాయి. సిటీలో ఆదివారం ఉదయం విపరీతమైన పొగ కమ్ముకుంది. గత వారం రోజులుగా పింక్ సిటీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 337 పాయింట్లుగా నమోదవుతున్నది. దీంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. అయితే తామున్నది క్రికెట్ ఆడటానికే అని భారత వైస్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ అంటున్నాడు. పొల్యూషన్ అంత తీవ్రంగా ఏమీ లేక పోవచ్చని అభిప్రాయపడ్డాడు.
మంచు ప్రభావం కూడా ఉండనుంది. పింక్ సిటీ జైపూర్లో ఇప్పటికే రాత్రి వేళలో భారీ స్థాయిలో మంచు కురుస్తున్నది. దీంతో ఈ సిరీస్లోనూ టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత సవాయ్ మాన్సింగ్ స్టేడియం ఫస్ట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుండటంతో.. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ) కూడా టీమిండియా విజయం కోసం చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మ్యాచ్ టైమ్లో మంచు ప్రభావం తగ్గించేందుకు కెమికల్స్ను స్ప్రే చేయాలని డిసైడ్ అయ్యింది.